విమాన ప్రమాదంలో మాజీ సీఎం

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు,10 మంది విమాన సిబ్బంది, ప్రయాణికులు 242 మంది ఉన్నారు. అయితే, ఆ ప్రయాణికులలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రకారం రూపానీ పేరు ఉన్న ఎయిరిండియా విమానం ప్యాసెంజర్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. రూపానీతోపాటు పలువురు రాజకీయ నాయకులు, వీఐపీలు ఆ విమానంలో లండన్ కు ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

విమానం ఎక్కారని ఎయిరిండియా సిబ్బంది కన్ఫర్మ్ చేసిన జాబితాలో రూపానీ పేరు ఉంది. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 12.10కి బోర్డింగ్ చేసినట్లు ఆ జాబితాలో ఉంది. లండన్ లో నివసిస్తున్న తన కుమార్తెను చూసేందుకు రూపానీ వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రూపానీ గాయపడ్డారా లేదా? ఆయన ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు అన్న సమాచారం తెలియాల్సి ఉంది. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రూపానీ పనిచేశారు.

మరోవైపు, ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు టేకాఫ్ అయిన విమానం..1.35కు క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ కు ఈ విమానం వెళుతుండగా ప్రమాదం జరిగింది.