ఊరిస్తూ… ఊసురుమనిపిస్తూ..

ఏపీలో గత ఖరీఫ్, ఇటీవలే ముగిసిన రబీ సీజన్లు ఎంచక్కా… ఎలాంటి ఆటంకాలు, వాతావరణ ప్రతికూలతలు లేకుండా సాఫీగా సాగిపోయాయి. ఫలితంగా అన్నదాతలు కూడా మునుపటి కంటే కూడా నాలుగు బస్తాల ధాన్యాన్ని అధికంగా పండించి సంతోషంలో మునిగిపోయారు. అటు ఖరీఫ్ సీజన్ ముగింపు, ఇటు రబీ ముగింపు సందర్భంగా అకాల వర్షాలు లేని కారణంగా ఏపీలో ధాన్యం తడిసిందన్న మాటే వినిపించలేదు. అయితే ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందుగానే వస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో అన్నదాతలు ఎదురుచూస్తుంటే… వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి.

మే నెలాఖరు నాటికే నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయని, ఫలితంగా గతేడాది కంటే కాస్తంత ముందుగానే తొలకరి వర్షాలు పడతాయని గత నెలలో వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అప్పటికే రబీ పంట నూర్పిళ్లు, ధాన్యం అమ్మకాలు పూర్తి చేసుకున్న అన్న దాతలు ఖరీఫ్ కు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. కూటమి సర్కారు కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. తొలికలి పడిందంటే… ఖరీఫ్ సాగు మొదలెట్టేద్దామని అన్నదాతలు చూస్తుండగా… నైరుతి మాత్రం అంతకంతకూ వెనక్కెళ్లిపోతోంది. ఫలితంగా అన్నదాత అయోమయంలో పడిపోయాడు.

ఇదిలా ఉంటే… నైరుతి ఆలస్యంతో తొలకరి వర్షాలు రాకున్నా సరే… జూన్ మాసంలోనూ ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసి ఇక వేసవి చల్లబడినట్టేనన్న సూచనలు కనిపించాయి. అయితే మే మాసాంతం నుంచి జూన్ ప్రారంభం దాకా ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఇదేంటీ తొలకరి వర్షాలు వస్తాయనుకుంటే.. ఇక సూర్య భగవానుడు భగభగమంటూనే ఉన్నాడంటూ రైతాంగం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. పర్యావరణ సమతుల్యత కారణంగానే ఈ తరహాలో అనుకున్న సమయానికి వర్షాలు రాకపోవడం గానీ, ఎండలు మరింత కాలం పాటు కొనసాగడం గానీ జరుగుతూ ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.