ఉద్యోగంలో జీతం పెరిగిన అనంతరం దాన్ని మళ్ళీ వెనక్కి ఇచ్చే అనుభవం ఇప్పటివరకు ఎవరికి ఎదురై ఉండదు. కానీ ఇటీవల అలాంటి ఘటన ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రముఖ ఐరిష్ విమానయాన సంస్థ రయన్ఎయిర్ ఓ విచిత్ర నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు లోనైంది. ఇటీవల తన సిబ్బందికి జీతాలు పెంచిన ఈ సంస్థ.. ఇప్పుడు అదే పెంపును తిరిగి చెల్లించమంటూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 2.8 లక్షల వరకు పెరిగిన మొత్తాన్ని కంపెనీ ఖాతాలో తిరిగి జమ చేయాలని కోరింది. లేదంటే మెల్లగా జీతాల నుంచి కోత వేస్తామని హెచ్చరించింది.
ఈ వివాదానికి మూలకారణం.. రయన్ఎయిర్, కార్మిక సంఘాల మధ్య ఏర్పడిన ఒప్పందమే. రయన్ఎయిర్కి చెందిన రెండు ప్రధాన కార్మిక సంఘాల్లో ఒకటైన ‘సీసీఓఓ’తో సంస్థ జీతాల పెంపు ఒప్పందం చేసుకుంది. దీనినుసరించి ఉద్యోగుల వేతనాలను పెంచింది. అయితే, దీనిపై మరో కార్మిక సంఘం ‘యూఎస్ఓ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించింది.
విచారణ జరిపిన కోర్టు.. సీసీఓఓతో కుదుర్చుకున్న ఒప్పందం చెల్లదని తేల్చింది. ఈ తీర్పును ఆధారంగా చేసుకొని సంస్థ తాము ఇచ్చిన జీతాల పెంపును రద్దు చేస్తూ, ఉద్యోగులకు మళ్లీ ఆ మొత్తాన్ని చెల్లించాలని నోటీసులు పంపించింది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేతనాలపై ఒకసారి నిర్ణయం తీసుకున్నాక.. తిరిగి తీసుకోవడం తగదని మండిపడుతున్నారు.
యూఎస్ఓ ప్రతినిధి ఎస్టర్ పెయ్రో గాల్డ్రాన్ మాట్లాడుతూ.. తమ సభ్యులపై ఒత్తిడి తెస్తూ సీసీఓఓలో చేరాలంటూ కంపెనీ చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. వేతనాల పెంపు చెల్లదన్న కోర్టు తీర్పును సవాలు చేస్తామని చెప్పారు. ఇది ఉద్యోగుల హక్కులకు వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, రయన్ఎయిర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. “మేము కోర్టు తీర్పును పాటిస్తున్నాము. యూఎస్ఓదే కోర్టులో కేసు వేసింది. ఇప్పుడు వారి కోరిన తీర్పు వచ్చినందున, మేము చర్యలు తీసుకుంటున్నాము” అని తెలిపారు. ఈ పరిణామం విమానయాన రంగంలో వేడి చర్చకు దారితీసింది.