ఐపీఎల్.. కొత్త అప్‌డేట్ ఏంటి?

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ముందుగా వారం రోజుల పాటు లీగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఐతే ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే పరిస్థితులు మారిపోయాయి. భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం తర్వాత కూడా నిన్న రాత్రి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ.. శత్రు దేశానికి భారత్ దీటుగా బదులిచ్చింది. దీంతో పాక్ వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి యుద్ధానికి తెరపడినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో కార్యకలాపాలు యథాస్థితికి వస్తున్నాయి. ఐపీఎల్‌ను కూడా తిరిగి మొదలుపెట్టడానికి మార్గం సుగమమైంది.

ఐతే ఓవైపు సరిహద్దులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, మరోవైపు లీగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన రావడంతో విదేశీ ఆటగాళ్లు వెంటనే స్వదేశాలకు బయల్దేరి వెళ్లిపోయారు. చాలా వరకు ఫారిన్ ప్లేయర్స్, స్టాఫ్ ఇండియాను వీడారు. దీంతో లీగ్‌ను మళ్లీ మొదలుపెట్టడం వారిని వెనక్కి తీసుకురావడాన్ని బట్టే ఉంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే వీకెండ్లో లీగ్‌ను పున:ప్రారంభించాలని అనుకుంటున్నారు. మిగతా మ్యాచ్‌లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. మళ్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినా..సౌత్ మీద ప్రభావం ఉండదు కాబట్టి ఈ నగరాలను ఎంచుకున్నారు.

లీగ్ దశలో ఇంకో 14 మ్యాచ్‌లు ఉన్నాయి. తర్వాత ప్లేఆఫ్స్‌లో నాలుగు మ్యాచ్‌లు నిర్వహించాలి. మధ్యలో ఆగిన పంజాబ్-ఢిల్లీ మ్యాచ్‌ను కూడా తిరిగి తొలి బంతి నుంచి నిర్వహించాలని భావిస్తున్నారట. అందుకే ఆ మ్యాచ్ పాయింట్లను రెండు జట్లకు పంచలేదు. లీగ్ మ్యాచ్‌లను రోజుకు రెండు చొప్పున చకచకా కానిచ్చేయాలని భావిస్తున్నారు. ప్లేఆఫ్స్ వరుసగా నాలుగు రోజుల్లో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ముందున్న షెడ్యూల్ ప్రకారం మే 25న టోర్నీ ముగియాలి. కానీ ఇప్పుడు మే చివరి వరకు టోర్నీని పొడిగించే అవకాశముంది.