రూ.2000 నోట్లు.. RBI మరో సూచన!

నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023 మే 19న ప్రారంభించింది. అప్పటికి దేశవ్యాప్తంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇప్పటి వరకు వాటిలో 98.24 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి చేరగా, మిగిలిన రూ.6,266 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్దే ఉండటం గమనార్హం.

ఈ నోట్లను డిపాజిట్ చేసేందుకు పౌరులకు గత ఏడాది అక్టోబర్ 7 వరకు అవకాశం ఇచ్చిన RBI, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న తన 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనే ఈ సేవలను కొనసాగిస్తోంది. అయితే ఇప్పటికీ కొన్ని కోట్ల విలువైన నోట్లు తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో RBI మరోసారి స్పష్టమైన ప్రకటన చేసింది. ఇప్పటికీ చెలామణీలో ఉన్న రూ.2000 నోట్లు “లీగల్ టెండర్”గానే కొనసాగుతాయని పేర్కొంది. అంటే, అవి చెల్లుబాటు అయ్యే నోట్లుగానే ఉండటంతో ప్రజలు వాటిని ఉపయోగించడానికి వెనకాడటం లేదు.

ఇదే సమయంలో RBI, ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లు తిరిగి జమ చేయాలని కోరుతోంది. దీనికోసం RBI ప్రాంతీయ కార్యాలయాలను నేరుగా సంప్రదించకపోయినా, పోస్టాఫీస్ ద్వారా ఆ నోట్లను పంపించేందుకు వీలుగా సూచనలు చేసింది. పోస్టు ద్వారా పంపిన నోట్ల విలువను సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.

వాస్తవానికి రూ.2000 నోట్లు 2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం తాత్కాలికంగా పెద్ద విలువ కలిగిన కరెన్సీ అవసరాన్ని తీర్చేందుకు తీసుకొచ్చారు. వాటి ముద్రణను 2018 తర్వాత నిలిపివేశారు. వీటిని చిన్న మొత్తాల కరెన్సీలతో స్థానంలోకి తేవడమే లక్ష్యంగా RBI ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా చూసుకుంటే.. రూ.2000 నోట్లు చలామణిలో తగ్గినప్పటికీ, ఇంకా వేల కోట్ల రూపాయలు విలువైన నోట్లు ప్రజల చేతుల్లో ఉండటం భారత ఆర్థిక వ్యవస్థలో నగదు ఆధారిత లావాదేవీల ప్రాధాన్యతను రుజువు చేస్తోంది.