ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుతున్న వేళ, ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారుతోంది. అయితే అత్యద్భుత ఫామ్లో ఉన్న రెండు జట్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ ఫైనల్లో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండూ తమ తదుపరి మ్యాచ్ల్లో విజయం సాధిస్తే, అభిమానుల కల నిజమయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆర్సీబీ టేబుల్ టాపర్గా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలతో అగ్రస్థానం దక్కించుకుంది. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య వంటి ఆటగాళ్ల ఫామ్ ఆ జట్టుకు బలంగా నిలుస్తోంది. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో కనీసం రెండు గెలిస్తే ఆర్సీబీ టాప్-2 ప్లేస్ను ఖాయం చేసుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సన్రైజర్స్, సీఎస్కే, లక్నో, కేకేఆర్తో జరిగే మ్యాచ్లపై అభిమానుల ఆసక్తి ఎక్కువగా ఉంది.
ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే, ప్రారంభంలో నష్టపోయినా ఇప్పుడు బలంగా పుంజుకుంది. వరుసగా ఐదు విజయాలతో మూడో స్థానానికి ఎగబాకింది. జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడం ముంబై బలాన్ని పెంచింది. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో కనీసం రెండు గెలిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ టికెట్ ఖాయం. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్లపై విజయాలపై ముంబై ఆశలు పెట్టుకుంది.
ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఫైనల్ వరకు చేరితే మాత్రం ఈసారి ఐపీఎల్ మరింత కిక్కిచ్చే అవకాశం ఉంది. ఒకవైపు చరిత్రలో ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ దక్కించుకోలేని ఆర్సీబీ, మరోవైపు ఐదు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్. ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్రస్తుత ఫామ్, పాయింట్స్ టేబుల్ పరిస్థితిని బట్టి చూస్తే, ప్లే ఆఫ్స్కు ఆర్సీబీ, ముంబై ఇండియన్స్తో పాటు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేరే అవకాశాలు ఎక్కువ. పంజాబ్ కింగ్స్కు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక లక్నో, కేకేఆర్, సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ కు రావడం అంత ఈజీ కాదు. రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మొత్తం మీద, అభిమానులు కోరుకున్న ఆర్సీబీ వర్సెస్ ముంబై ఫైనల్ జరుగుతుందా? లేక ఇంకెవరైనా ట్విస్ట్ ఇస్తారా అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజుల వేచి చూడాల్సిందే.