పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.70-80 వేల మధ్య ఉంటే.. గత నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.లక్షకు చేరింది. కీలకమైన అక్షయ తృతీయను పురస్కరించుకుని అంతో ఇంతో బంగారం కొనుగోలు చేయాలని అనుకున్న వారికి ఉసూరు మనిపిస్తూ.. మంగళవారం నాటికి ఇది రూ.102000లకు చేరింది. దీంతో పుత్తడి కొనాలనుకునే వారు పరేషాన్ అవుతున్నారు.
మరి బంగారం ధరలు ఇలా భగభగ మనడానికి కారణాలు ఏంటి? ఎందుకు? అనే విషయాలు ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా చర్చకు వస్తున్నాయి. సాధారణంగా ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. రాజకీయాల గురించి చర్చించుకోవడం కామన్.. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా సరే.. బంగారం ఏంటి బ్రో ఇంత పెరిగిపోయింది? అనే చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మార్కెట్ వర్గాలు, నిపుణులు అయితే.. విశ్లేషణలపై విశ్లేషణలు చేస్తూ.. బిజీబిజీగా గడిపేస్తున్నారు..
ఈ నేపథ్యంలో బంగారం ధరల వ్యవహారం ఆసక్తిని పెంచేసింది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు మూలకారణం ఏంటని ఆలోచిస్తే.. ఒకటి కాదు రెండు మూడు ప్రధాన ప్రపంచ స్థాయి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 1) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు. 2) ప్రపంచ వ్యాప్తంగా బంగారంపై పెరుగుతున్న ఆసక్తి. 3) ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేస్తుండడం.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా కూడాబంగారం డిమాండ్ పెరిగిపోయింది. వాస్తవానికి మన దేశంలో భూములపై పెట్టుబడులు పెడతారు. దక్షిణాదిలో అయితే మరింత ఎక్కువ. కానీ.. ప్రపంచ వ్యాప్తంగా బూములపై కన్నా.. బంగారంపైనే పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉంది.. పైగా ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానంతో ఎప్పుడు ఏ ధర ఎలా పెరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. ఏ రంగం ఎప్పుడు కుప్పకూలుతుందో కూడా తెలియని దుస్థితి ఉంది.
ఎప్పుడు తగ్గొచ్చు?
ఈ నేపథ్యంలోనే పుత్తడిపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో బంగారం ధరలు మరింత వేగంగా పుంజుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా విధానాలు సమీక్షించడం మొదులు పెట్టినా.. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ భయాలు తగ్గినా.. అప్పుడు మాత్రమే బంగారం ధరలు కొంత మేరకు దిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.