ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి స్పేస్ టూర్లో పాల్గొన్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ నిర్వహించిన ఈ ప్రయాణం కేవలం 11 నిమిషాల వ్యవధిలో పూర్తయింది. అయితే ఈ షార్ట్ స్పేస్ రైడ్ అనుభవించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కేటీ పెర్రీతో పాటు ఈ అంతరిక్ష ప్రయాణంలో జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్, టీవీ వ్యాఖ్యాత గేల్ కింగ్, మాజీ నాసా శాస్త్రవేత్త ఐషా బోవీ, శాస్త్రవేత్త అమండా గుయెన్, నిర్మాత కెరియాన్నె ఫ్లిన్ ఉన్నారు. వీరందరూ బ్లూ ఆరిజిన్ సంస్థ పంపించిన స్పేస్ క్యాప్సూల్లో ప్రయాణించి భూమి అంచు వరకు వెళ్లి వచ్చారు. ఇది సాధారణంగా ‘అంతరిక్షపు అంచు’గా పరిగణిస్తారు.
ఈ ప్రయాణం కోసం సాధారణంగా టికెట్ ధర ఎంతనేది బ్లూ ఆరిజిన్ అధికారికంగా చెప్పదు. కానీ, ఒకరిని రిజర్వ్ చేయాలంటే ముందుగానే సుమారు రూ.1.25 కోట్లు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. 2021లో తొలి స్పేస్ టూర్కి జరిగిన వేలంలో ఒక్క సీటు రూ.240 కోట్లకు అమ్ముడైందని రిపోర్టులు చెప్పాయి.
అయితే అందరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. బ్లూ ఆరిజిన్ కొన్ని ప్రముఖులను ‘గౌరవ అతిథులు’గా ఉచితంగా తీసుకెళుతోంది. తాజా ప్రయాణంలో కూడా కొంతమంది డబ్బు చెల్లించగా, మరికొందరికి ఉచిత ప్రయాణం కల్పించినట్లు సమాచారం. అయితే ఎవరు చెల్లించారు, ఎవరు ఉచితంగా వెళ్లారన్న విషయాన్ని బ్లూ ఆరిజిన్ గోప్యంగా ఉంచింది. మొత్తంగా ఇలా ఒక తార అంతరిక్షం చేరడం అభిమానులకు ప్రత్యేక అనుభూతినే ఇచ్చింది.