ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇంజినీరింగ్ లో అద్భుతాలు చేయడంలో చైనా మరోసారి తన ప్రతిభను చూపించింది. గుయ్ఝౌ ప్రాంతంలోని బీపన్ నదిపై చైనా నిర్మించిన “హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్” ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
ఈ వంతెన సముద్ర మట్టానికి 2050 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది. అందుకే ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందుతోంది. ఈ వంతెన పొడవు సుమారు రెండు మైళ్లుగా ఉంటుంది. గతంలో ఈ లోయను చుట్టూ తిరిగే ప్రయాణానికి గంట సమయం పడుతుండగా, ఇప్పుడు ఈ వంతెనపై ప్రయాణం కేవలం ఒక నిమిషంలో పూర్తవుతోంది.
రవాణా వేగాన్ని పెంచడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు తేలికైన కనెక్టివిటీ అందించడంలో ఈ వంతెన కీలకంగా మారనుంది. 2022లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును మూడేళ్ల వ్యవధిలోనే పూర్తి చేశారు. దీనికి దాదాపు 280 మిలియన్ డాలర్లు (రూ.2400 కోట్లకు పైగా) ఖర్చు పెట్టారు. మూడు రెట్లు ఎక్కువ బరువు, అత్యాధునిక నిర్మాణ సాంకేతికతతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిర్మాణం పూర్తయిన ఈ వంతెనను ఈ ఏడాది జూన్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ వంతెన ద్వారా చైనాలో పర్యాటక రంగానికి ఊపొచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అనుభవించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు, ఇది చైనాలోని మరో కొత్త ప్రయాణ గమ్యస్థానంగా కూడా మారనుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెనల్లో దాదాపు సగం చైనాలోనే ఉండడం గమనార్హం. దీని ద్వారా చైనా ఎత్తైన నిర్మాణాల పట్ల చూపుతున్న ఆసక్తిని, అభివృద్ధిపై పెట్టుబడులను స్పష్టంగా చూడొచ్చు. ఈ హువాజియాంగ్ బ్రిడ్జ్ చైనాకు మరో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినట్టు మారింది.