ఒక్క రోజు మార్కెట్ పతనంతో ప్రపంచ కుబేరులకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావం స్టాక్ మార్కెట్లను హడలెత్తించింది. దాంతో పాటు దేశీయంగా కూడా మార్కెట్లు నేలచూపులు చూశాయి. దీంతో భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు తమ సంపదలో భారీగా కోల్పోయారు. ప్రముఖ ఆర్థిక పత్రిక ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం.. కేవలం ఒక్క రోజులోనే భారత కుబేరులు రూ.86,000 కోట్లకు పైగా కోల్పోయినట్లు వెల్లడించింది.
భారత ధనవంతుల్లో టాప్లో ఉన్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరోజులోనే $3.6 బిలియన్లు కోల్పోయారు. గౌతమ్ అదానీ సంపదలో $3 బిలియన్ల తగ్గుదల చోటు చేసుకోగా, సావిత్రి జిందాల్ ఫ్యామిలీ $2.2 బిలియన్లు, శివ్ నాడార్ $1.5 బిలియన్లకు పైగా కోల్పోయారు. సోమవారం జరిగిన ఈ మార్కెట్ పతనంతో, ఒకే రోజు నాలుగు టాప్ ఇండియన్ బిలియనీర్లు కలిపి దాదాపు $10.3 బిలియన్ల సంపదను పోగొట్టుకోవాల్సి వచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2,200 పాయింట్లకు పైగా పడిపోవడం, నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోవడం దీనికి ప్రధాన కారణాలు.
అయితే ట్రంప్ టారిఫ్ వల్ల మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు, వాణిజ్య ఉద్రిక్తతలతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండటంతో అమ్మకాలు పెరిగాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో కార్పొరేట్ లాభాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో, రేట్ల పెంపు భయాలు కూడా మార్కెట్లో ఒత్తిడిని పెంచినట్లు కనిపిస్తోంది.
ఇక ఈ ప్రభావం కేవలం భారత బిలియనీర్లకే పరిమితం కాలేదు. ప్రపంచ ధనవంతుల్లోనూ నష్టాలు మామూలుగా లేవు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక్కరోజులో $130 బిలియన్లు కోల్పోయి తన సంపదను $302 బిలియన్లకు తగ్గించుకున్నారు. జెఫ్ బెజోస్ $45 బిలియన్లు, మార్క్ జూకర్బర్గ్ $28 బిలియన్లు, బెర్నార్డ్ ఆర్నాల్ట్ $18 బిలియన్లు కోల్పోయారు. బిల్ గేట్స్ సంపద కూడా $3.3 బిలియన్లు తగ్గిపోయింది. ఇదిలా ఉంటే.. పెట్టుబడిదారుల వాపులు కొనసాగుతుండగా, మార్కెట్లు మళ్లీ ఎప్పుడు కోలుకుంటాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.