సెకెండ్ వేవ్ – ఫ్రాన్స్ లో ఒక్క రోజు 47 వేల కేసులు

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని మళ్ళీ వణికించేస్తోంది. మొదటిసారి కొట్టిన దెబ్బకే ప్రపంచదేశాలు ఇంత వరకు కోలుకోలేదు. అలాంటిది కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్ళీ విజృభిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో సెకెండ్ వేవ్ మొదలైంది. ఐరోపా దేశాల్లో గురువారం ఒక్కరోజే దాదాపు లక్షమంది వైరస్ భారిన పడితే అమెరికాలో మాత్రమే 50 వేల కేసులు నమోదయ్యాయి. ఐరోపా దేశాల్లో వరస్ట్ ఎఫెక్టెడ్ దేశాలేవంటే ఫ్రాన్స్ అనే చెప్పాలి. తాజగా ఫ్రాన్స్ లో నాలుగు వారాలపాటు లాక్ డౌన్ విధించేశారు.

కరోనా వైరస్ కారణంగా మొదటిసారి ఎదురైన అనుభవంతో రెండోసారి ఫ్రాన్స్ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. గురువారం ఫ్రాన్స్ లో 47 వేల కేసులు నమోదయ్యాయి. దాంతో ముందుజాగ్రత్తగానే లాక్ డౌన్ పెట్టేసింది. ఫ్రాన్స్ మొత్తంమీద 12 లక్షల కేసులు రిజస్టర్ అయ్యున్నాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు అన్నింటీనీ మూసేశారు. రెస్టారెంట్లు, హోటళ్ళు, పబ్బుల్లాంటి వినోద కేంద్రాలు కూడా మూతపడ్డాయి. పబ్లిక్ జమకూడే ప్రాంత కేంద్రాన్ని మూసేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. పార్శిల్ సర్వీసులున్న రెస్టారెంట్లు తప్ప మిగిలిన అన్నింటినీ మూసేయించింది.

దేశంలో ఎమర్జెన్సీ విధించినట్లుగా ఉంది పరిస్ధితి. ఎందుకంటే గురువారం నుండి దేశంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దేశప్రజలను రోజుకు మూడు గంటలు మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తోంది. దాంతో మొదటిసారి అనుభవంతో జనాలు కూడా టెన్షన్ తో బయటకు రావటమే మానేశారు.

ఇక ఫ్రాన్స్ తో పాటు వరస్టు ఎఫెక్టెడ్ అమెరికా కూడా ఇబ్బందుల్లో పడుతోంది. అమెరికా మొత్తంమీద గురువారం 50 వేల కేసులు నమోదవ్వటంతో జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాకపోతే ఫ్రాన్స్ లో లాగ లాక్ డౌన్ విధించలేదు. ఎందుకంటే నవంబర్ 3వ తేదీన అధ్యక్షుడి ఎన్నికలు ఉన్న కారణంగా లాక్ డౌన్ పొడిగించలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని ఉన్నతాధికారుల ప్రకటనలను బట్టి తెలుస్తోంది.