మహా కుంభమేళా సందర్భంగా యావత్ దేశాన్ని ఆకర్షించిన ఒక అంశం పూసలు అమ్ముకునే మోనాలిసా భోంస్లే. పదహారేళ్ల ఈ నిరేపేద టీనేజర్ జీవితాన్నే మార్చేసింది కుంభమేళా. దీంతో ఆమె జాతీయ సెలబ్రిటీగా మారటమే కాదు.. ఒక బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా.. తన సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. త్వరలో తీసే ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ మూవీలో ఒక పాత్రకు ఆమెను ఎంపిక చేసుకోవటం తెలిసిందే. ఇందుకోసం మోనాలిసా కుటుంబ సభ్యుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ అవుతుందని గతంలో ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. తాజాగా సదరు దర్శకుడు అరెస్టు కావటం హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో ఛాన్సులు ఇస్తానని చెప్పి తనను మోసం చేశాడంటూ ఝూన్సీకి చెందిన ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన ఢిల్లీ పోలీసులు అతడ్ని అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. 2020లో సనోజ్ తో తనకు పరిచయం ఏర్పడిందని.. టిక్ టాక్.. ఇన్ స్టా వేదికగా తాము కలుసుకున్నట్లు చెప్పారు.
సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ తరచూ ఫోన్లు చేసేవాడని..ఒకసారి ఝూన్సీకి వచ్చి తాను చెప్పిన చోటుకు రాకుంటే చనిపోతాడని బెదిరింపులకు దిగినట్లు పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో అతడు చెప్పిన ప్లేస్ కు తాను వెళ్లానని.. అక్కడి నుంచి తనను రిసార్టుకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి తనను వేధించినట్లుగా పేర్కొంది. అసభ్య వీడియోలు షూట్ చేసి బెదిరింపులకు దిగినట్లుగా ఆరోపించింది. ఆ వీడియోలు బయటపెడతానని బెదిరిస్తూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలిపింది.
సినిమాల్లో అవకాశాలు ఇస్తానని.. పెళ్లి చేసుకుంటానని తనకు అబద్ధాలు చెప్పినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ అనంతరం అతడ్నిఅరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంతో పూసలమ్మాయి మోనాలిసా పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.