భారీ ప్రైజ్ మనీతో రోహిత్ సేనకు అదిరిపోయే గిఫ్ట్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అజేయంగా విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. తుదిపోరులో న్యూజిలాండ్‌పై దెబ్బ మీద దెబ్బ కొట్టిన భారత్, అద్భుతమైన ప్రదర్శనతో ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ మొత్తం రూ. 58 కోట్లు ప్రైజ్ మనీగా ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బీసీసీఐ ప్రకటించిన ఈ ప్రైజ్ మనీ అధికారికంగా ఐసీసీ ప్రకటించిన ప్రైజ్ మనీ కంటే మూడు రెట్లు ఎక్కువ. సాధారణంగా ఐసీసీ టైటిల్స్‌కు గాను ఒక స్థిరమైన నగదు బహుమతి ఉంటుంది. కానీ బీసీసీఐ భారత ఆటగాళ్ల కృషిని గుర్తించి ప్రైజ్ మనీ మొత్తాన్ని భారీగా పెంచింది. ఇది కేవలం ఆటగాళ్లకే కాకుండా కోచింగ్, సపోర్ట్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీ సభ్యులను కూడా కలుపుకొని ఇవ్వనుంది. టీమిండియా బలమైన ప్రదర్శన కనబరిచినందుకు గానూ ఈ ప్రత్యేకమైన గౌరవం లభించిందని చెప్పుకోవచ్చు.

ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రొజర్ బిన్నీ మాట్లాడుతూ, “ఇప్పటికే ఐసీసీ టైటిల్స్‌లో వరుసగా విజయం సాధించడం భారత క్రికెట్ బలాన్ని నిరూపిస్తోంది. 2025లో అండర్-19 మహిళల ప్రపంచకప్‌ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవడం మన దేశం నిర్మించుకున్న క్రికెట్ ఎకోసిస్టమ్‌ను మరోసారి రుజువు చేస్తోంది” అన్నారు. ఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, “ఈ విజయం కేవలం ఒక్క టోర్నమెంట్ విజయం మాత్రమే కాదు. టీమిండియా బలమైన టీమ్‌గా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న నిరూపణ” అని చెప్పారు.

టోర్నమెంట్‌లో టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్‌లలో హవాను చూపించింది. బంగ్లాదేశ్‌పై ఆరువికెట్ల తేడాతో విజయంతో క్యాంపెయిన్‌ను ప్రారంభించిన భారత్, పాకిస్తాన్‌ను కూడా అదే మార్జిన్‌తో ఓడించింది. న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించిన భారత జట్టు, అక్కడ ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఫైనల్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించి న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. బీసీసీఐ ప్రకటించిన ఈ భారీ బహుమతి భారత క్రికెట్‌ దర్పాన్ని తెలియజేసే విధంగా ఉంది.