టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ ఇటీవల తీసుకున్న కొత్త విధానం ప్రకారం, 45 రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఉన్న విదేశీ టూర్లలో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు మొదటి రెండు వారాల తర్వాత మాత్రమే ప్లేయర్స్ తో ఉండే వీలుంటుంది. అంతేకాదు, వారి గడువు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయంపై విరాట్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, టూర్ సమయంలో కుటుంబ సభ్యుల సమక్షం చాలా కీలకమని చెప్పాడు.
“ఒక ఆటగాడిగా, మైదానంలో ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత కుటుంబంతో గడిపే సమయమే మళ్లీ సాధారణ స్థితికి తీసుకువస్తుంది. కానీ, ఇప్పుడు తీసుకున్న నిబంధన వల్ల మేము ఒంటరిగా ఉండాల్సి వస్తుంది,” అని కోహ్లీ తెలిపాడు. టూర్ సమయంలో కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని తగ్గించడం ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్పై సెంచరీ, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 84 పరుగులు సాధించి జట్టు విజయానికి కీలకంగా మారాడు.
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కోహ్లీ భార్య అనుష్క శర్మ స్టేడియంలో అతనికి మద్దతుగా కనిపించింది. మ్యాచ్ అనంతరం ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇదే విధంగా, కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా, కూతురు సమైరా కూడా జట్టుకు మద్దతుగా స్టేడియంలో కనిపించారు. కోహ్లీ తన కుటుంబ సభ్యుల సమక్షం ఆటతీరుపై సానుకూల ప్రభావం చూపుతుందని చెబుతూ, “ఒంటరిగా కూర్చొని బాధపడటానికి నాకు ఇష్టం లేదు. ఒక ఆటగాడిగా నా బాధ్యత పూర్తయ్యాక, సాధారణ జీవితం గడపాలి” అని చెప్పాడు.
క్రికెట్ ఆటగాళ్లు మైదానంలో ఒత్తిడిని ఎదుర్కొనడంలో కుటుంబ ప్రోత్సాహం చాలా కీలకమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ విధానం ఆటగాళ్ల వ్యక్తిగత జీవితంపై నిజంగానే ప్రభావం చూపిస్తుందా? అనే చర్చలు క్రికెట్ వర్గాల్లో కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో బీసీసీఐ ఈ నిబంధనను పునఃసమీక్షించే అవకాశముందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.