ఈ ఊపులో కప్పు కొట్టేస్తారా ఏంటి?


ఇప్పుడు ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబయి ఇండియన్స్ కాదు. దాని తర్వాతి స్థానాల్లో ప్లేఆఫ్‌కు అత్యంత చేరువగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా కాదు. కొన్ని రోజుల కిందటి వరకు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండి, ఈసారి ప్లేఆఫ్‌‌కు ముందు దూరం కాబోయే జట్టుగా అవమాన భారాన్ని మోసి.. తర్వాత అనూహ్యంగా పుంజుకుని ప్లేఆఫ్ రేసులో పైపైకి ఎగబాకుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఇప్పుడు ఐపీఎల్ అభిమానులందరి చర్చా ఈ జట్టు గురించే. ఎందుకంటే ఆ జట్టు ప్రదర్శన ఇప్పుడు అంత గొప్పగా సాగుతోంది.

ఐపీఎల్‌లో చాలా కమ్ బ్యాక్స్ చూశాం. కానీ అందులో ఈసారి పంజాబ్‌ పునురుత్తేజం ప్రత్యేకమైంది. ఐపీఎల్ గ్రూప్ దశ ప్రథమార్ధంలో ఆ జట్టు బాగా ఆడినా సరే.. మ్యాచ్‌లు ఓడిపోయింది. సూపర్ ఓవర్‌కు దారితీసిన తొలి మ్యాచ్ సహా.. మళ్లీ మళ్లీ విజయానికి దగ్గరగా వచ్చి ఓటములు చవిచూసింది. దీంతో ఆ జట్టు పట్ల అందరూ జాలిపడ్డారు. కానీ ఈ ఓటములతో కుంగిపోని పంజాబ్.. పోరాట స్ఫూర్తిని చూపించింది.

తొలి ఏడు మ్యాచుల్లో ఆరు ఓడిపోయినా సరే.. ఆశ కోల్పోకుండా పట్టుదలతో ఆడి వరుసగా ఐదు విజయాలు సాధించింది. గత మ్యాచ్‌లో అయితే మొదట పంజాబ్ చేసింది 126 పరుగులే అయినా సరే.. సన్‌రైజర్స్‌ను అద్భుత బౌలింగ్‌తో కట్టడి చేసి 12 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. తాజా మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ ప్రదర్శనతో న్యూట్రల్ ఫ్యాన్స్ అందరికీ ఫేవరెట్ జట్టుగా మారిపోయింది పంజాబ్.

కింగ్స్ ఎలెవన్ జోరు, ఆ జట్టు సమష్టితత్వం, పోరాట పటిమ చూస్తుంటే.. ఈ ఊపులో కప్పు కొట్టేసినా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తోంది. టైటిల్ ఫేవరెట్లలో ముందున్న ముంబయి గత మూడు మ్యాచుల్లో రెండు ఓడిపోయింది. పైగా ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో టోర్నీకి దూరమవుతున్నాడు. మరోవైపు ఢిల్లీ వరుసగా రెండు ఓటములు చవిచూసింది. బెంగళూరు జట్టు మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ అది పరిపూర్ణ జట్టులాగా అయితే లేదు. మధ్య మధ్యలో తేలిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే పంజాబ్ జట్టున్నంత కసితో, సమష్టితత్వంతో, ఊపుతో మరే జట్టూ లేదు. వరుస విజయాలు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచాయి. ఈ ఊపులో ప్లేఆఫ్ బెర్తు సాధించి, అక్కడా దీటైన ప్రదర్శన చేస్తే తొలిసారి కప్పు గెలిచినా గెలుస్తారేమో.