టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. లావుగా ఉన్నాడంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యలు కేవలం అభిమానులను మాత్రమే కాదు, భారత క్రికెట్ బోర్డును కూడా తీవ్ర అసహనానికి గురిచేశాయి. ఐసీసీ టోర్నీ మధ్యలో ఉన్న సమయంలో ఇలాంటి అనవసర వ్యాఖ్యలు అవసరమా అని కౌంటర్లు వస్తున్నాయి.
ఈ వివాదంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ, ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని స్పష్టంగా అన్నారు. “ఈ తరహా వ్యక్తిగత విమర్శలు ఆటగాళ్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. జట్టు ఒక కీలక టోర్నీలో పోటీ పడుతున్న తరుణంలో, బాధ్యతాయుతమైన వ్యక్తుల నుంచి ఇలాంటి మాటలు రావడం అసహనకరం” అని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో రోహిత్కి మద్దతుగా క్రికెట్ వర్గాలు, అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
కానీ శమా మహమ్మద్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. “క్రీడాకారులు ఫిట్గా ఉండాలి అనే ఉద్దేశ్యంతోనే నేను పోస్ట్ లో అలా రాశాను. ఇది బాడీ షేమింగ్ కాదు” అని వివరణ ఇచ్చారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు క్రీడా ప్రపంచానికే కాదు, రాజకీయ వర్గాలకు కూడా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందిస్తూ, తమకు ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
ఇదంతా జరుగుతుండగా, టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మరో సంచలన వ్యాఖ్య చేసి నూతన వివాదానికి తెరతీశారు. “రోహిత్ జట్టులో కూడా ఉండకూడదు” అంటూ ఆమె చేసిన కామెంట్స్ మద్దతుగా వ్యాఖ్యానించడంతో, ఈ వివాదం మరింత ముదిరింది. మొత్తానికి, ఈ వ్యాఖ్యలు పొలిటికల్ గా కాంగ్రెస్ కు కొంత డ్యామేజ్ తీసుకు వచ్చే ప్రమాదం ఉంది. మరి ఆ పార్టీ అధిష్టానం ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.