ఊరించి ముంచేసిన బంగ్లాదేశ్ : పాక్ ఇక ఇంటికే!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో, పాక్ సెమీస్ కు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. గ్రూప్-ఏలో ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో ఓటమి చెందిన పాకిస్థాన్, ఇప్పుడు చివరగా బంగ్లాదేశ్ పై గెలిచినా కూడా, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

న్యూజిలాండ్ ఈరోజు బంగ్లాదేశ్ పై విజయం సాధించిన తర్వాత, గ్రూప్-ఏలో భారత్, కివీస్ రెండూ 4 పాయింట్లతో సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. పాకిస్థాన్ ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ, అది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. ఈ పరాజయంతో పాకిస్థాన్ అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగిన పాక్ ఈసారి చాలా నిరాశపరిచింది.

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసి 236 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. అనంతరం కివీస్ మొదట తడబడింది. 15 వికెట్లకు రెండు వికెట్లు పడడంతో పాక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపించింది. 73 పరుగుల వద్ద కాన్వె కూడా ఔట్ అవ్వడంతో మ్యాచ్ యూ టర్న్ కానుందని అనుకున్నారు. కానీ రచిన్ రవీంద్ర తన సెంచరీతో పాక్ ఆశలను ఆవిరి చేశాడు.

బంగ్లాదేశ్ మొదట 3 వికెట్లు తీసి కాస్త ఊరించి ఆ తరువాత నిండా ముంచేసిన పరిస్థితి ఏర్పడింది. రవీంద్ర న్యూజిలాండ్ విజయానికి కీలకంగా నిలిచాడు. 105 బంతుల్లో 112 పరుగులు చేసిన అతడు, బంగ్లాదేశ్ బౌలర్లను ఇబ్బందికి గురిచేశాడు. టామ్ లాథమ్ 55 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 21 (నాటౌట్) తో నిలిచారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజూర్ రెహ్మాన్ తలో వికెట్ తీసుకున్నారు.

ఇప్పటికే రెండు పరాజయాలతో వెనకబడ్డ పాకిస్థాన్, ఈ ఫలితంతో పూర్తిగా బయటకు వెళ్లింది. చివరి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఉన్నప్పటికీ, అది కేవలం గౌరవం కాపాడుకోవడానికి మాత్రమే. న్యూజిలాండ్, భారత్ రెండూ సెమీస్ లోకి అడుగు పెట్టగా, పాక్ అభిమానులు మరోసారి నిరాశతో తలదించుకున్నారు. టోర్నీ ప్రారంభం నుంచి బలహీన ప్రదర్శన, అనవసర ఒత్తిడి, తక్కువ స్థాయిలో ఆటతీరు పాక్ జట్టును విఫలమయ్యేలా చేశాయి.