ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఉగ్ర ముప్పు?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతున్న వేళ, ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు కొత్త ముప్పును గుర్తించాయి. పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఈ మెగా ఈవెంట్‌ను టార్గెట్ చేస్తూ, మ్యాచ్‌లకు హాజరైన విదేశీయులను కిడ్నాప్ చేయాలనే పథకం వేసినట్లు సమాచారం. ముఖ్యంగా తెహ్రిక్-ఇ-తాలిబన్ (TTP), ఐసిస్, బలూచిస్థాన్ గ్రూపులు ఈ కుట్రలో భాగమని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించి, స్టేడియంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ అంశాన్ని బహిర్గతం చేస్తూ, టోర్నీకి హాజరైన విదేశీయులు టార్గెట్ అవ్వవచ్చని భద్రతా బలగాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశంలో క్రికెట్ పునరుద్ధరణ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చేస్తున్న కృషికి ఇది భారీ ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే భారత్ పాకిస్థాన్‌లో భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ దేశంలో ఆడటానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో పీసీబీ హైబ్రిడ్ మోడల్‌ అంగీకరించి, భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించాల్సి వచ్చింది. ఈ తాజా భద్రతా హెచ్చరికలతో మరింత ఆందోళన పెరిగింది.

ఇక క్రికెట్ పరంగా కూడా పాకిస్థాన్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై, సెమీఫైనల్ అవకాశాలు దాదాపు కోల్పోయినట్టే. న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో, భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన పాక్ జట్టు ఇప్పుడు అద్భుతం జరిగితే తప్ప తదుపరి దశకు వెళ్లలేని స్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో భద్రతా సమస్యలు కూడా తలెత్తడంతో పాకిస్థాన్ క్రికెట్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.