నీ మాటలు సమాజానికే సిగ్గు చేటు : రణవీర్ పై సుప్రీం ఫైర్

ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల శృంగారంపై రణవీర్ ఓ టీవీ షోలో అసందర్భ, జుగుత్సాకరంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యాక గానీ… తన వ్యాఖ్యలు ఎంత తప్పో అతడికి తెలియరాలేదు. దీంతో వెంటనే నష్ట నివారణకు దిగిన రణవీర్… తన వ్యాఖ్యలు తప్పేనని బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అయినా కూడా అతడి తీరుపై జనానికి ఆగ్రహం తగ్గలేదు. ఎక్కడికక్కడ అతడిపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో దిక్కుతోచని రణవీర్.. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదు అవుతున్న కేసులన్నింటినీ ఒకేసారి, ఒకే చోట విచారణ జరిగేలా ఆధేశాలు ఇవ్వాలని, అంతేకాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా అతడు కోర్టును అభ్యర్థించాడు.

రణవీర్ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం రణవీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీ వ్యాఖ్యలు ఎంత తీవ్రమైనవో మీకు తెలుసా అంటూ ప్రశ్నించింది. మీ వ్యాఖ్యలు మీ తల్లిదండ్రులతో పాటు మీ అక్కాచెల్లెళ్లని కూడా సిగ్గుపడేలా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ కుటుంబ సభ్యులనే కాకుండా మీ వ్యాఖ్యలు యావత్తు సమాజానికే సిగ్గుచేటుగా నిలుస్తున్నాయని కూడా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏదో స్నేహితులతో కూర్చున్నప్పుడు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవాలే గానీ… ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసెలా వచ్చిందని కూడా కోర్టు ప్రశ్నించింది.

మనమంతా ఓ న్యాయ వ్యవస్థలో బతుకుతున్నామన్న విషయాన్ని మరిచిపోరాదని కూడా కోర్టు రణవీర్ కు గుర్తు చేసింది. ఆ న్యాయ వ్యవస్థ ఓ చట్టం పరిధిలో ఉందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని సూచించింది. ఈ విషయాలను మరిస్తే… చట్టం తన పని తాను చేసుకుని పోతుందని కూడా కోర్టు హెచ్చరించింది. ఇదిలా ఉంటే… రణవీర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు… దేశం విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించింది. పోలీసుల విచారణకు సహకరించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. కేసులన్నింటినీ ఒకే చోట విచారించేందుకు కూడా కోర్టు అనుమతించింది.