ప్రపంచ వాణిజ్య విఫణిలో భారత దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సత్తా చాటింది. గతంలో ఏ ఒక్క బారత కంపెనీకి దక్కని కీర్తి ప్రతిష్ఠలను ఒడిసిపట్టేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్… టాప్ బ్రాండింగ్ కంపెనీల్లో రెండో స్థానంలో నిలిచి భారతీయులకు గర్వ కారణంగా నిలిచింది. నిజంగానే రిలయన్స్ సాధించిన ఈ ఘనతతో ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగిపోయిందని చెప్పక తప్పదు. నిన్నటిదాకా బ్రాండింగ్ లో తొలి స్థానంలో ఉన్న అమెరికా దిగ్గజం ఆపిల్ ను మించిన బ్రాండ్ గా రిలయన్స్ ఎదిగింది. ఈ మేరకు ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 పేరిట విడుదలైన జాబితాలో రిలయన్స్ రెండో స్థానంలో నిలిచింది.
ఏటా ప్రపంచంలోని టాప్ 100 కంపెనీల బ్రాండ్లు, వాటికి దక్కుతున్న ఆదరణ, కంపెనీ ఎదుగుతున్న తీరు, కంపెనీ నెట్ వర్త్ లను పరిగణనలోకి తీసుకునే ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఓ జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఇదే జాబితాలో రిలయన్స్ ఏకంగా 13 స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఆపిల్ టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే కేవలం ఏడాది వ్యవధిలోనే సత్తా చాటిన రిలయన్స్ 13వ స్థానం నుంచి ఒకేసారి రెండో స్థానానికి ఎగబాకింది. నిరుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఆపిల్… రిలయన్స్ తర్వాతి స్థానమైన థర్డ్ ప్టేస్ తో సరిపెట్టుకుంది.
ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 జాబితాలో ఈ ఏడాది కొరియాకు చెందిన కంపెనీ శాంసంగ్ తొలి స్థానంలో నిలిచింది. శాంసంగ్ తర్వాత రిలయన్స్ రెండో స్తానంలో నిలవగా… ఆ తర్వాతి స్థానాల్లో ఆపిల్, నైక్, వాల్డ్ డిస్నీ, నెట్ ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టయోటాలు నిలిచాయి. ఇదిలా ఉంటే… ఈ జాబితాలో బారత్ నుంచి ఒక్క రిలయన్స్ కు మాత్రమే చోటు దక్కింది. మరే ఇతర భారత కంపెనీలకు ఈ జాబితాలో చోటే దక్కలేదు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నఒకే ఒక్క ఇండియన్ కంపెనీగా నిలిచిన రిలయన్స్ ఏకంగా రెండో స్థానంలో నిలవడం గమనార్హం.