కేఎల్ రాహుల్‌ కు అన్యాయం చేస్తున్నారా?

ఇంగ్లండ్‌పై టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్‌ ఆర్డర్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను కిందిస్థానంలో పంపించడం, రిషభ్‌ పంత్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోచ్‌ గౌతం గంభీర్‌ నిర్ణయాలు సమర్థనీయమా? అని ప్రశ్నించారు.

రాహుల్‌ను అనవసరంగా నంబర్‌ 6, 7 స్థానాల్లోకి పంపి అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని శ్రీకాంత్‌ మండిపడ్డారు. గతంలో నంబర్‌ 5వ స్థానంలో రాహుల్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడని, ఇప్పుడు అతనికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సరైన నిర్ణయం కాదని తెలిపారు. అక్షర్‌ పటేల్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపించడం వ్యూహంగా సరైనదే అయినా, ఇది స్థిరమైన ఆలోచన కాకూడదని హెచ్చరించారు.

లెఫ్ట్ రైట్‌ కాంబినేషన్‌ కోసం మాత్రమే ఈ మార్పులు చేస్తున్నారా? అక్షర్‌ను పైకి పంపే నిర్ణయాన్ని టాప్‌ 4 లో ఎందుకు పాటించరు? అని ప్రశ్నించారు. ఇక రిషభ్‌ పంత్‌ను పూర్తిగా పక్కనపెట్టడంపై కూడా శ్రీకాంత్‌ అసహనం వ్యక్తం చేశారు. అతడికి మూడో వన్డేలో అవకాశం ఇవ్వాలని, అంతర్జాతీయ టోర్నమెంట్లలో అతడి అనుభవం టీమ్‌కు ఉపయోగపడుతుందని చెప్పారు.

ఇప్పటికే భారత్‌ వన్డే సిరీస్‌ కైవసం చేసుకున్న నేపథ్యంలో.. చివరి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ ముందు టీమ్ఇండియా చివరి వన్డే మ్యాచ్‌ కావడంతో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. గంభీర్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చ కొనసాగుతుండగా, రాహుల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై స్పష్టత రావాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.