“నరకం చూపిస్తా” : ట్రంప్ డెడ్‌లైన్‌!

ఇజ్రాయెల్ – హమాస్ ఘర్షణలో కీలక మలుపు చోటుచేసుకుంది. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుని పునర్నిర్మించాలని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు. పాలస్తీనియన్లు దీనికి అంగీకరించకపోతే, మిత్రదేశాలైన జోర్దాన్, ఈజిప్ట్‌లకు అమెరికా ఇచ్చే సహాయాన్ని నిలిపివేస్తానని స్పష్టం చేశారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికితోడు, బందీల విడుదలను ఆలస్యం చేయబోతున్నట్లు ప్రకటించింది.

ఈ పరిస్థితుల్లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు కఠిన హెచ్చరిక చేశారు. శనివారం నాటికి బందీలందరినీ విడుదల చేయకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన ఓవెల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, హమాస్ తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే నరకం చూపించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

ఇక త్వరలో ట్రంప్, జోర్దాన్ రాజు అబ్దుల్లా 2 భేటీ కానున్నారని వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల గాజాలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై మరింత రాజకీయ ఒత్తిడి పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాజా ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు 21 మంది బందీలను హమాస్ విడుదల చేసింది.

అయితే, బదులుగా ఇజ్రాయెల్ 730 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తాజా బందీల విడులపై చర్చలు సాగుతుండగా, హమాస్ ప్రకటన ఉద్రిక్తతలకు దారితీసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందన్న ఆరోపణలతో హమాస్ కొత్త కుయుక్తులను ప్రయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.