విదేశాల్లో 10,000 మందికి పైగా భారత ఖైదీలు

విదేశీ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం 86 దేశాల్లో మొత్తం 10,152 మంది భారతీయులు వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక అందులో మరికొందరు విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. ఇందులో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ), నేపాల్, కువైట్, ఖతార్, పాకిస్తాన్, అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, స్పెయిన్, రష్యా, ఇజ్రాయెల్, అర్జెంటీనా వంటి దేశాలు ఉన్నాయి.

ఈ వివరాలను లోక్‌సభలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కిర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. సౌదీ అరేబియాలో అత్యధికంగా 2,633 మంది భారతీయులు జైళ్లలో ఉండగా, యుఏఈలో 2,518 మంది ఖైదీలుగా ఉన్నారు. నేపాల్‌లో 1,317 మంది, పాకిస్తాన్‌లో 266 మంది, శ్రీలంకలో 98 మంది భారతీయులు జైళ్లలో ఉన్నారు. అయితే ఖతార్‌లో 611 మంది భారతీయ ఖైదీలున్నప్పటికీ, ఆ దేశ గోప్యతా నిబంధనల ప్రకారం ఖైదీల వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదని మంత్రి వెల్లడించారు.

ఫిఫా వరల్డ్ కప్ అనంతరం ఖతార్‌లో భారతీయ ఖైదీల సంఖ్య పెరిగిందా అన్న ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాచారం లేదని చెప్పింది. విదేశీ జైళ్లలో భారతీయుల హక్కులను రక్షించడానికి భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని భారతీయ మిషన్లు, రాయబార కార్యాలయాలు తమ దేశీయుల అరెస్ట్ లేదా నిర్బంధ సమాచారం అందిన వెంటనే స్పందిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇక సంబంధిత దేశాల అధికారులతో సంప్రదించి, వారిని రక్షించడానికి సహాయపడతాయని అన్నారు.

ఇక అవసరమైన చోట్ల వారికి లీగల్ ఎయిడ్ కూడా అందిస్తున్నారు. చాలా చోట్ల భారతీయులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు స్థానిక న్యాయవాదులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేశారు. ఇతర దేశాల్లో జైళ్లలో ఉన్న భారతీయుల రక్షణ కోసం ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) ద్వారా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. వీరి రవాణా వ్యయాలు, తిరిగి స్వదేశానికి పంపించే ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తోంది.

అంతేకాదు, భారత ప్రభుత్వం సంబంధిత దేశాల అధికారులతో చర్చలు జరిపి, అవసరమైతే శిక్షల మాఫీ (అమ్నెస్టీ) పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అనేక దేశాలతో ఖైదీల మార్పిడికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. విదేశాల్లో భారతీయ ఖైదీల సమస్యపై భారత ప్రభుత్వం కచ్చితంగా స్పందిస్తూ, వారికి న్యాయ సహాయం, రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోంది.

అయితే, భారత పౌరులు విదేశీ చట్టాలను గౌరవించి, అక్రమ కార్యకలాపాల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం కీలకం. ప్రభుత్వ సహాయం అందిస్తున్నా, విదేశాల్లో చిక్కుకున్న వారు తిరిగి స్వదేశానికి రావడం అంత సులభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.