బ్రెజిల్‌లో రూ.40 కోట్లకు ఒంగోలు ఆవు

బ్రెజిల్‌లో జరిగిన ఓ అద్భుతమైన వేలం బహుళ దేశాల్లో చర్చనీయాంశమైంది. వేలంలో భారతీయ మూలాలున్న నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు ఊహించని రీతిలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. మినాస్ గెరైస్‌లో నిర్వహించిన ఈ వేలంలో, వియాటినా-19 అనే ఆవును ఏకంగా 4.8 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.40 కోట్లు) ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ ఘనతతో ఈ ఆవు గిన్నిస్ రికార్డుల పుటల్లో చోటు సంపాదించింది.

వియాటినా-19 ఓ సాధారణ గోవు కాదు. దాని బరువు 1,101 కిలోలు, అంటే సాధారణ నెల్లూరు ఆవులతో పోలిస్తే రెట్టింపు. ఈ జాతికి చెందిన ఇతర ఆవులను మించి వియాటినా-19 అత్యంత ప్రత్యేకమైనది. దీని గళిపాలు (కండరాల నిర్మాణం), జన్యు లక్షణాలు అత్యంత అరుదైనవి కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, ఇది ‘మిస్ సౌత్ అమెరికా’ అవార్డును కూడా గెలుచుకుంది. “చాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్” పేరుతో నిర్వహించే పోటీల్లోనూ విశేష గుర్తింపు పొందింది.

నెల్లూరు ఆవుల పుట్టిల్లు భారతదేశమే. వీటిని మనం సాధారణంగా ఒంగోలు జాతిగా కూడా పిలుస్తాం. వీటి ప్రత్యేకత ఏమిటంటే, ఇవి అధిక ఉష్ణోగ్రతలు తట్టుకుని జీవించగలవు, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. 1800వ దశకంలో బ్రెజిల్‌కు ఈ జాతిని ఎగుమతి చేశారు. అప్పటి నుంచి అక్కడ పెంపొందించుకుంటూ, ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆవులుగా నిలిచాయి.

ప్రస్తుతం, వియాటినా-19 నూతన రికార్డు సృష్టించడంతో, నెల్లూరు జాతి ఆవులపై అంతర్జాతీయ స్థాయిలో మరింత ఆసక్తి పెరిగింది. జన్యుపరంగా అత్యంత విలువైన ఈ ఆవుల వంశవృక్షాన్ని కాపాడేందుకు, విస్తరించేందుకు బ్రెజిల్ వ్యాపారవేత్తలు, పరిశోధకులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ వేలం వల్ల భారతీయ మూలాలున్న నెల్లూరు జాతి గొప్పతనం మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది.