మారిటోరియం ‘వడ్డీంపు’.పై..కేంద్రం గుడ్ న్యూస్

కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక రంగం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎందరో ఉద్యోగాలు కోల్పోయి…మరెన్నో వ్యాపారాలు దివాలా తీసి….చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి 6 నెలలపాటు మారిటోరియం విధించేలా వెసులుబాటు కల్పించింది ఆర్‌బీఐ.

అయితే మారిటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించడంతో ప్రజల నడ్డి విరిగినంత పనైంది. కరోనా కాలంలో కరువు తాండిస్తున్న సమయంలో అసలు కట్టేందుకే దిక్కుతోచకుంటే….బ్యాంకులు వడ్డీపై వడ్డీ వసూలు సరైంది కాదని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన సుప్రీం….రుణగ్రహీతలపై వడ్డీ భారం పడకుండాచర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐలను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో మారిటోరియంపై వడ్డీ విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారిటోరియంపై వడ్డీని మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకు కేంద్రం తెలిపింది. మార్చి, ఆగస్టు మధ్యకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి కూడా వడ్డీ మాఫీ వర్తిస్తుందని కేంద్రం చెప్పింది. వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం వల్ల ప్రజలపై పడే భారాన్ని భరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సుప్రీంకోర్టుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అఫిడవిట్ సమర్పించింది.

రూ.2 కోట్ల వరకు ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత రుణాలు, విద్య, గృహ, వినియోగదారుల రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో రుణాలు వంటి అన్నింటిపై వడ్డీపై వడ్డీ మాఫీ అవుతుందనిక కేంద్రం స్పష్టం చేసింది. కేంద్తం తాజా నిర్ణయంతో రుణగ్రహీతలకు ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు.