WTC ఫైనల్‌కు టీమిండియా పయనం క్లిష్టమా?

పుణేలో జరిగిన రెండో టెస్టులో టీమిండియాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కివీస్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇదే భారత గడ్డపై న్యూజిలాండ్ సాధించిన తొలి టెస్టు సిరీస్‌ విజయం కావడంతో చరిత్ర సృష్టించింది. భారత్‌ తన సొంత గడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2012-13 సీజన్‌లో ఇంగ్లండ్ పర్యటనలో భారత గడ్డపై టీమిండియా ఓడిపోయింది.

ఆ తర్వాత ఇన్నాళ్లకు టీమిండియా మరోసారి సొంత గడ్డపై పరాజయం చవిచూసింది. ఇంతకుముందు బెంగళూరులో జరిగిన తొలి టెస్టులోనూ భారత జట్టు దారుణమైన పరభవాన్ని చూసింది. సిరీస్‌పై మొదటి నుంచి న్యూజిలాండ్ ఆధిపత్యం సాధించింది. ఈ సిరీస్‌లో భారత్‌ ప్రదర్శన పట్ల మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకోవాలంటే టీమిండియా మిగిలిన మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన చేయాలని సూచించాడు.

కుంబ్లే మాట్లాడుతూ, “ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ విధానం టెస్టు మ్యాచ్‌ల ప్రాముఖ్యతను పెంచింది. భారత్‌ ఈ సిరీస్‌ కోల్పోవడంతో WTC ఫైనల్‌కు చేరడం మరింత కష్టతరం అయింది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుందని అనుకున్నాం. కానీ, ఇప్పుడు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించాల్సి ఉంది. మిగిలిన టెస్టుల్లో బ్యాటర్లు బాగా ఆడి విజయం సాధించాలి” అని వివరించారు. భారత బౌలర్లు సవాళ్లను ఎదుర్కొని ప్రతిఘటన చూపినా, బ్యాటింగ్ విభాగం నిరాశపరిచిందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. జట్టు సమష్టిగా కలిసి ఆడితే WTC ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పాడు.