70 బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్‌కు భారీ నష్టం

ఇటీవల దేశీయ విమానయాన రంగంలో బాంబు బెదిరింపుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది విమానయాన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. గడచిన వారం పది రోజుల్లోనే 70కి పైగా బెదిరింపులు నమోదయ్యాయి. బాంబు బెదిరింపులు వచ్చిన ప్రతిసారీ అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ బెదిరింపులు ప్రధానంగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అందివ్వబడుతున్నాయి.

అయితే, ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులే కావడం విశేషం. అయినా సరే, ప్రొటోకాల్ ప్రకారం విమానయాన సంస్థలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సి రావడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. విమానం గాల్లో ఉన్నప్పుడు బెదిరింపు వస్తే, వెంటనే సమీప విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికులను దింపి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం, అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉంటే బాంబ్ స్క్వాడ్‌ని పిలిపించడమనే ప్రక్రియలు జరుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది.

ఇతర విమానాల షెడ్యూల్‌ని చెక్ చేసి ఏటీసీ అనుమతి పొందడం, విమానం మళ్లీ ఎగరాలంటే సమయం పట్టడం వంటివి ఈ ప్రక్రియలో ఒక భాగం. ఈ కారణంగా ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌లో వేచి ఉండాల్సి రావడంతో విమానయాన సంస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో ప్రయాణికులకు అవసరమైన హోటల్ వసతి, భోజన ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను అందించాల్సిన బాధ్యత కూడా విమానయాన సంస్థలకే ఉంటుంది.

ఈ ఏర్పాట్లు చేయడంలో అయ్యే ఖర్చు, ఒకవేళ విమానాన్ని దారిమళ్లిస్తే వచ్చే అదనపు ఇంధన ఖర్చులు ఇలా కలిపితే ఒకసారి బెదిరింపులు వచ్చిన ప్రతీసారీ కనీసం రూ. 3 కోట్ల వరకు ఖర్చవుతోందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. అంతే కాకుండా, ఈ పరిస్థితే లీగల్ సమస్యలకు కూడా దారితీస్తోంది. అంతర్జాతీయ కనెక్టింగ్ ఫ్లైట్‌ బుక్ చేసుకున్న ప్రయాణికులు, ఒకవేళ తమ విమానం ఆలస్యం అవ్వడం వల్ల తర్వాతి విమానాన్ని మిస్ అయితే, కోర్టులో కేసులు వేయడం సర్వసాధారణం. మరి ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం వెతుకుతారో చూడాలి.