ఏమిటీ ఎదురుదెబ్బలు.. జగన్ పార్టీ నేతల్లో అంతర్మధనం

కొన్నిసార్లు అంతే.. ఏం చేసినా అడ్డే ఉండదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తిరుగు ఉండనట్లుగా ఉంటుంది. కానీ.. ఒక్కసారి సీన్ మారిపోతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన షాకులతో పాటు.. తాజాగా ఎదురవుతున్న సవాళ్లతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పుడు ఏపీ అధికార పక్షానికి అలాంటి పరిస్థితే నెలకొని ఉంది. అన్ని వైపుల నుంచి ఏదో ఒక ఒత్తిడి రావటం.. ఇప్పటివరకూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నది లేదన్న మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పలువురు వ్యాఖ్యానించుకోవటం కనిపిస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పలువురికి కరోనా పాజిటివ్ గా తేలటం కొత్త విషయం కాకున్నా.. జగన్ కు తలలో నాలుకలా.. ఆయన నీడలా వ్యవహరించే విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ తేలటంతో పార్టీ వర్గాలు షాక్ కు గురయ్యాయి.ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ కు తీసుకురావటం.. అపోలో ఆసుపత్రిలో చేర్చటం ఆసక్తికరంగా మారింది. నిన్నటికి నిన్న శిరోముండనం వ్యవహారంతో పాటు.. రాష్ట్రపతి కోవింద్ ను పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ కమ్ రెబల్ అయిన రఘురామ రాజు భేటీ కావటం.. బయటకువచ్చిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి.

ఇవి సరిపోన్నట్లు ఈ రోజు విషయానికి వస్తే.. నిమ్మగడ్డను ఎస్ఈసీగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గవర్నర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మధ్యనే రాష్ట్ర హైకోర్టు ప్రభు్త్వాన్ని మొట్టికాయలు వేయటం తెలిసిందే. గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో తాజాగా ఆదేశం ప్రభుత్వానికి మింగుడుపడనిది మారిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది.

ఇదిలా ఉండగా.. ప్రకాశం జిల్లా చీరాలలో ఒక వ్యక్తిపై స్థానిక పోలీసులు దౌర్జన్యానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటివరకూ ఏపీలో కరోనా కేసులు పెద్దగా లేవంటూ జగన్ భేష్ అనే వారు సైతం మాటల కోసం వెతుక్కునేలా రోజుకు పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఐదు వేల కేసుల వరకూ నమోదంటే.. మామూలు విషయం కాదు. ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. అన్ని కోణాల్లోనూ జగన్ వ్యతిరేక పరిణామాలు చోటు చేసుకోవటంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఏమిటీ ఎదురుదెబ్బలన్న మాట పలువురు నేతల నోటి నుంచి రావటం గమనార్హం.