అట్లుంటది మల్లారెడ్డి తోని..

శాసనసభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నది. నాలుగు నెలల కాంగ్రెస్ వైఫల్యాలను తూర్పారబడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగ సభలు పెట్టిన కేసీఆర్ బస్సు యాత్రతో అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాడు.

పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ని ఆపసోపాలు పడుతుంటే మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. శుక్రవారం హైదరాబాద్‌ మేడ్చల్ పరిధిలోని కండ్లకోయలో ఉన్న కేఎస్ఎఆర్ ఫంక్షన్ హాలులో ఓ వివాహ వేడుకలో మల్లారెడ్డి, బీజేపీ మల్కాజ్‌గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఇద్దరూ హాజరై ఎదురుపడ్డారు.

ఈ సందర్భంగా ఈటెలను పలకరించిన మల్లారెడ్డి’అన్నా, మల్కాజ్‌గిరి నుంచి నువ్వే గెలుస్తున్నావ్ అని కౌగిలించుకుని .. మా అన్నతో ఫోటో తీయండి’ అంటూ అక్కడున్న వారిని కోరాడు. ఈటెలతో కాసేపు మాట్లాడాడు.

బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్న ఈటెల పార్టీ వ్యవహారాలకు భిన్నంగా ఉన్నాడని మంత్రి పదవి నుండి తొలగించారు. దానికి నిరసనగా రాజీనామా చేసి గెలిచిన ఈటెల గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయి ఈసారి మల్కాజ్ గిరి నుండి బీజేపీ ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన మల్లారెడ్డి ఇటీవల ఎన్నికలలో మరోసారి మేడ్చల్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించగా, మల్కాజ్ గిరి నుండి ఆయన సొంత అల్లుడు రాజశేఖర్ రెడ్డి విజయం సాధించాడు. అయితే అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మల్లారెడ్డి విద్యాసంస్థలు, భవనాలను కూలగొడుతూ ఇబ్బందులు పెట్టడంతో వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరతారన్న వార్తలు వచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ సైలెంట్ అయిపోయారు.

గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ తరపున ఉత్సాహంగా ప్రచారం చేస్తున్న మల్లారెడ్డి హఠాత్తుగా పెళ్లిలో ఎదురుపడ్డ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుస్తాడని చెప్పడం కలకలం రేపుతున్నది. రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్ధులను పలకరించడం ఓకే గానీ, వారే గెలుస్తారని చెప్పడం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.