వైసీపీ నేతల పక్కచూపులు.. జగన్ బిస్కెట్లు

YS JAgan

యూపీ ఫలితాల సెగతో పాటు పెల్లుబుకుతున్న ప్రభుత్వ వ్యతిరేకత సెగ వైసీపీని తాకుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు టీడీపీ, బీజేపీ వైపు చూస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో దిద్దుబాటు చర్చలు ప్రారంభించిన జగన్ సీనియర్ లీడర్లను కాపాడుకోవడానికి తాజాగా మరో ఎత్తుగడ వేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని సూచించారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో కలిపి 25 మందికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం క్యాబినెట్ లో సీఎంతో పాటుగా మరో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, 18 మంది మంత్రులున్నారు. ఇటీవల కేబినెట్ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఓ స్థానం ఖాళీ అయింది.

వైసీపీ అధికారంలోకి రాగానే ప లువురు సీనియర్లు మంత్రివర్గంలో చోటు కోసం ఎదురుచూశారు.. కానీ జగన్ మాత్రం యువతకు ఛాన్స్ ఇచ్చారు. తన క్యాబినెట్ లో  తొలుత కేవలం ఐదుగురికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభం ఉండగా వారిలో ఇద్దరు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపించడంతో వారి స్థానంలో తీసుకున్న ఇద్దరు మంత్రులు సీదరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు కూడా తొలిసారిగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారయ్యారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కేవలం బొత్సా సత్యన్నారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీలోని అనేక మంది సీనియర్లు రెండున్నరేళ్లుగా మంత్రి పదవుల కోసం చూస్తున్నారు.

అలాంటి వారిలో చాలామంది టీడీపీ వైపు చూస్తుండగా మరికొందరు బీజేపీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఈ సమాచారం ప్రభుత్వం వద్ద ఇప్పటకే ఉన్నప్పటికీ ఇంతవరకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. కానీ, తాజాగా నాలుగు రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించి దక్షిణాదిపైనా దృష్టి పెట్టడానికి రెడీ అవుతుండడంతో నాయకులను వదులుకోకుండా జాగ్రత్తపడాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ క్రమంలోనే ఆయన ఇంతవరకు ప్రస్తావనకు కూడా తేని మంత్రివర్గ విస్తరణ మాట బయటపెట్టారు.

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది… అలాగే మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని వైసీపీ వర్గాలలోనే వినిపిస్తోంది. ఇలా చాలామంది సీనియర్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ మంత్రివర్గం ఆశచూపి మరికొన్నాళ్లు నాయకులను ఆపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలా ఎంతకాలం సాధ్యమవుతుందన్నది చూడాలి.