తెలంగాణ రైతులు క‌నిపించ‌డం లేదా.. కేసీఆర్ సారూ!

మోడీ స‌ర్కారు తెచ్చిన మూడు రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఏడాది కాలంగా పంజాబ్‌, హ‌రియాణా, ఢిల్లీ రైతులు ఉద్ధృతంగా పోరాటం చేశారు. ఆందోళ‌న‌లో భాగంగా 700కు పైగా రైతులు మ‌ర‌ణించారు. వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆ చ‌ట్టాల‌ను మోడీ ర‌ద్దు చేశార‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఎలాగైతేనేమీ రైతుల పోరాటానికి ఫ‌లితం ద‌క్కింది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల వ‌రి కోనుగోళ్ల విష‌యంలో కేంద్రంపై పోరుబాట ప‌ట్టిన కేసీఆర్‌.. తాజాగా రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన రైతుల త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకున్నారు. చ‌ట్టాలు ర‌ద్దు చేశారు సంతోష‌మే కానీ వాళ్ల‌పై పెట్టిన కేసులు ఎత్తివేయాల‌ని, చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని మోడీని డిమాండ్ చేశారు.

అంతే కాకుండా మ‌రో అడుగు ముందుకేసి తెలంగాణ ప్ర‌భుత్వం తర‌పున చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు రూ.3 ల‌క్ష‌ల చొప్పున అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ఉద్య‌మంలో భాగంగా 750కి పైగా రైతులు చ‌నిపోయార‌ని అంటున్నారు. ఇప్పుడా కుటుంబాల‌న్నింటికీ కేసీఆర్ ఆర్థిక సాయం చేస్తార‌న్న‌మాట‌. రైతుల కుటుంబాల‌కు సాయం చేయాల‌నుకునే పెద్ద మ‌న‌సు కేసీఆర్‌కు ఉండ‌డం మంచి విష‌య‌మే. కానీ రాష్ట్రంలో రైతుల బ‌తుకులు ఆగం చేసుకుంటూ బ‌య‌ట వాళ్ల‌కు అండ‌గా నిలుస్తామ‌ని చెప్ప‌డ‌మే ఇప్పుడు ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.

కేంద్రం వ‌రి కొనుగోళ్లు చేయ‌డం లేద‌ని చెప్తున్న కేసీఆర్‌.. రాష్ట్రంలో కోనుగోళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. చేతికి వచ్చిన పంట‌ను అమ్ముకోలేక‌.. అకాల వ‌ర్షాల‌కు ధాన్యం పాడ‌వుతుంటే.. ఇంకా కోయ‌ని పంట పొలాల్లోనే రాలిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక అన్న‌దాత‌ల గుండెలు ఆగిపోతున్నాయి. వ‌రి కుప్ప‌ల మీదే త‌నువు చాలిస్తున్న రైతుల ఫోటోలు హృదయాల‌ను క‌దిలించేస్తున్నాయి. పండిన పంట‌ను అమ్ముకుందామంటే రాజ‌కీయాల పేరుతో జాప్యం చేస్తున్న ఈ నాయ‌కుల ప‌ట్ల కోపంతో.. రైతుగా పంట పండించ‌డ‌మే పాప‌మా అనే బాధ‌తో బ‌ల‌వంతంగా ప్రాణాలు వ‌దిలేసుకుంటున్నారు.

ఇప్పుడేమో రాష్ట్రంలోని రైతుల గోస ప‌ట్ట‌ని కేసీఆర్‌.. ఇక ఇత‌ర రాష్ట్రాల రైతుల‌కు సాయం చేస్తామ‌ని చెప్ప‌డం ఏమిట‌ని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ఇంటికే చ‌క్క‌దిద్దుకోలేని వాడు ర‌చ్చ‌కెక్కి ఏమి సాధిస్తాడ‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎవ‌రి సొమ్ము ఎవ‌రికి పంచుతాన‌ని అంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వ‌రి కోనుగోళ్ల‌ను వేగ‌వంతం చేసి.. వ‌ర్షాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన రాష్ట్ర అన్న‌దాత‌ల‌ను ఆదుకునేది పోయి బ‌య‌ట‌క‌వాళ్ల‌కు సాయం చేయ‌డ‌మేంద‌ని ప్ర‌జ‌లు తీవ్ర కోపంతో ర‌గిలిపోతున్నారు. మ‌రోవైపు ఆర్టీసీ కార్మికుల స‌మ్మెను అణ‌గ‌దొక్కి.. కార్మికుల ప్రాణాలు పోతుంటే లెక్క చేయ‌ని సీఎం.. ఇప్పుడు రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా చేసిన ఉద్య‌మాన్ని కీర్తించ‌డ‌మేంట‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.