ఢిల్లీ కోట కూలుస్తాం: మోడీపై కేసీఆర్ కామెంట్స్‌

అనుకున్న‌ట్టుగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై విరుచుకుప‌డ్డారు. ఢిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డామని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 30 లక్షల బోర్లు వేసుకున్నట్లు స్పష్టం చేశారు. కానీ కేంద్రం అడ్డగోలుగా డీజిల్‌, ఎరువుల ధరలు పెంచి రైతులను ఆగం చేసిందని ఆరోపించారు. జనగామలో నిర్వహించిన టీఆర్ ఎస్‌ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్… కేంద్ర ప్రభుత్వంపైనా, ప్ర‌త్యేకించి మోడీపైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు.

తాము రైతుబంధు ఇస్తుంటే.. కేంద్రం రైతుల పెట్టుబడి ధరలు పెంచుతోందని మండిపడ్డారు. రైతుల విద్యుత్ కు మోటార్లు పెట్టబోమ‌ని.. అవసరమైతే ఢిల్లీకి వచ్చి పొట్లాడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు, మెడికల్‌ కళాశాల ఇవ్వరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇవ్వకున్నా పర్లేదు.. దేశం మిమ్మల్ని తరమడం ఖాయమని పేర్కొన్నారు. జాతీయ హోదా, మెడికల్‌ కళాశాలలు, కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చేవాళ్లనే తెచ్చుకుంటామని అన్నారు. ధాన్యం కొనబోమని కేంద్రం చెబుతోందని, మోడీ ప్రభుత్వం రైతుల వెంటపడిందని ఆరోపించారు.

కుంభకోణాలు చేసిన వారికి విమాన టిక్కట్లు ఇచ్చి విదేశాలకు పంపారని.. నీర‌వ్ మోడీ త‌దిత‌ర బ్యాంకుల‌ను ఎగ్గొట్టిన‌ వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “మా ప్రాణం పోయినా.. మోటార్లకు మీటర్లు పెట్టం అంటే పెట్టం. కేంద్రంపై తిరగబడతాం.. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కొట్లాడతాం.” అని కేసీఆర్ చెప్పారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే అందరం కొట్లాడతామ‌ని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం అని పిలుపునిచ్చారు. మీరందరూ దీవిస్తే ఢిల్లీ కోటలు బద్దలుకొడతా.. జాగ్రత్త మోడీ.. ఇది తెలంగాణ.. ఉడుత ఊపులకు భయపడేది లేదు. బీజేపీ వాళ్లను మేం టచ్ చేయం.. మమ్మల్ని టచ్ చేస్తే నాశ‌నం చేస్తాం! అని హెచ్చ‌రించారు.

జ‌నగామ జిల్లాకు భవిష్యత్‌లో కరువు రాకుండా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఒకనాడు కరువు ప్రాంతంగా పేరొందిన జనగామను పూర్తిగా సస్యశ్యామలం చేశామని చెప్పారు. మారుమూల నియోజకవర్గాలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్న కేసీఆర్‌, రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని వెల్లడించారు. ఏడేళ్లల్లో జనగామ జిల్లా అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 25 ఎకరాల్లో 58.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభించారు.

అందరి అనుమానాలు పటాపంచలు చేసి అభివృద్ధి సాధించామని వెల్లడించారు. ఈ సమయంలో ప్రొ.జయశంకర్‌ లేకపోవటం బాధాకరమన్నారు. ఒకప్పుడు జనగామ జిల్లా పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని గుర్తు చేసుకున్నారు. గోదావరి ఉద్ధృతంగా పారే జిల్లాలో నీటి కొరత చూసి ఎంతో బాధపడ్డానని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకుని జిల్లాలకు నీళ్లు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. జనగామ జిల్లా ప్రజాప్రతినిధులు నాతో కొట్లాడి నిధులు సాధించుకున్నారని తెలిపారు.