బర్నింగ్ క్వశ్చన్.. పుష్ప-2 పరిస్థితేంటి?

‘బాహుబలి’ తరహాలో ‘పుష్ప’ను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు సుకుమార్. ఇది మొదట్లోనే తీసుకున్న నిర్ణయం కాదు. ‘పుష్ప’ను ఒక సినిమాగా మొదలుపెట్టి.. రెండు మూడు షెడ్యూళ్లు పూర్తి చేశాక మధ్యలో తీసుకున్న నిర్ణయం. అచ్చంగా ఈ విషయంలో ‘బాహుబలి’నే ఫాలో అయినట్లు అనిపించింది అందరికీ. నిజంగా ఈ కథ పరిధి ఎక్కువ కావడంతో సుక్కు ఈ ఆలోచన చేశాడా.. లేక ఎక్కువ ఆదాయం కోసం ఇలా చేశారా అన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి.

‘పుష్ప’ పార్ట్-1 చూశాక చాలామందికి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయడం సరైన ఆలోచనగా అనిపించడం లేదు. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను లేపేసి.. ఫాహద్ ఫాజిల్ పాత్రను ముందే ప్రవేశపెట్టి.. హీరోకు, అతడికి వైరాన్ని చూపించి చివరగా హీరో గెలిచేట్లు చూపించి సినిమాను ముగించేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సంగతలా ఉంచితే ఇప్పుడసలు ‘పుష్ప-2’ భవిష్యత్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.

‘పుష్ప: ది రైజ్’కు విపరీతమైన హైప్ వచ్చింది. అనూహ్యమైన స్థాయిలో బిజినెస్ జరిగింది. సినిమా స్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ అన్న నమ్మకంతో చిత్ర బృందం ఉంది. ఈ సినిమా ఏమైనా తేడా అయితే.. అన్న ఆలోచనే లేదు. పార్ట్-2 షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలి.. ఎప్పుడు రిలీజ్ చేయాలన్న ప్రణాళికల్లో ఉన్నారు. స్క్రిప్టు కూడా దాదాపు రెడీగా ఉంది. దానికి మెరుగులు దిద్దుకుని ఫిబ్రవరిలో చిత్రీకరణకు వెళ్దామనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు ఊహించనిది జరిగింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. సినిమా బాక్సాఫీస్ సక్సెస్ మీద సందేహాలు నెలకొన్నాయి. వీకెండ్ వరకు వసూళ్ల విషయంలో ఢోకా లేకున్నా.. తర్వాత సినిమా నిలబడుతుందో లేదో తెలియట్లేదు. సినిమా మీద భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్ల పరిస్థితేంటో అర్థం కావడం లేదు.

ఒకవేళ ఈ సినిమాకు నష్టాలొస్తే ‘పుష్ప-2’ తీయాలా వద్దా అన్న మీమాంస మొదలవుతుంది. ఫెయిల్యూర్ సినిమాకు కొనసాగింపుగా ఇంకో సినిమా తీయడమేంటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇంతకముందు ‘యన్.టి.ఆర్’ సినిమా విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. కాకపోతే దాని సెకండ్ పార్ట్ ముందే చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో మిగతా పని పూర్తి చేసి రిలీజ్ చేయక తప్పలేదు. ‘పుష్ప-2’కు సంబంధించి షూటింగ్ ఏమీ చేయలేదు కాబట్టి ఆపేయాలనుకుంటే ఆపేయొచ్చు. ఐతే ‘పుష్ప’ మంచి లాభాలు తెచ్చిపెట్టకపోయినా.. కష్టపడి బ్రేక్ ఈవెన్ సాధిస్తే చాలు. రెండో పార్ట్‌కు ఢోకా ఉండదు.