మోడీ మాస్ట‌ర్ ప్లాన్‌.. రాష్ట్రాల‌పై ఒత్తిడి

రాజ‌కీయ నాయ‌కులు ఏం చేసినా బ‌య‌ట‌కు క‌నిపించేది ఒక‌టి ఉంటే.. దాని వెన‌క మ‌రో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న నేత‌లు ఏం చేసినా.. అధి త‌మ అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు తీసుకున్న నిర్ణ‌యంగానే క‌నిపిస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే? తాజాగా ప్ర‌ధాని మోడీ తీసుకున్న ఓ నిర్ణ‌యం కూడా ఇలాగే ఉంది మ‌రి. దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని దేశ ప్ర‌జ‌ల‌కు కానుక ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం లీట‌ర్‌కు పెట్రోల్‌పై రూ.5, డీజీల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పండ‌గ రోజున ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగించిన నిర్ణ‌య‌మిది అని బీజేపీ శ్రేణులు గొప్ప‌గా చెప్పుకుంటున్నాయి.

అయితే మోడీ నిర్ణయం వెన‌క మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించిన కేంద్రం.. రాష్ట్రాలు కూడా ఎంతో కొంత ప‌న్ను త‌గ్గించుకోవాల‌ని కోరింది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు ప‌న్ను త‌గ్గించాయి. కానీ బీజేపీయేత‌ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రం ఇంకా ప‌న్ను త‌గ్గించ‌లేదు. మ‌హారాష్ట్ర, ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌, మేఘాల‌య‌, పంజాబ్‌, రాజ‌స్థాన్‌.. ఇలా మొత్తం 14 రాష్ట్రాల్లో ప‌న్ను త‌గ్గింపు లేదు. అక్క‌డి ప్ర‌భుత్వాలు ఇంకా దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌పై బీజేపీ నాయకులు ఇప్పుడు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేంద్రం ప‌న్ను త‌గ్గించ‌గా లేనిది ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు మౌనంగా ఉందంటూ బీజేపీ నాయ‌కులు మాట‌ల‌తో రెచ్చిపోతున్నారు. ఇలా జ‌ర‌గాల‌నే మోడీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల‌తో పాటు లోక్‌స‌భ స్థానాల‌కూ ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. వాటిలో బీజేపీకి ఎదురు దెబ్బ త‌గిలింది. దీంతో ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ను చాలా ఆల‌స్యంగా అర్థం చేసుకున్న మోడీ ఇప్పుడు చ‌మురు ఉత్ప‌త్తుల‌పై ఎక్సైజ్ సుంకం త‌గ్గించింద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. అలాగే రాష్ట్రాలు కూడా త‌గ్గించాల‌ని సూచించి ఇప్పుడు ఆయా ప్ర‌భుత్వాల‌ను ఇర‌కాటంలో పెట్టింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కేంద్రం బాట‌లో సాగాయి. కానీ ఇత‌ర రాష్ట్రాలు మాత్రం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. అందులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ప‌న్ను త‌గ్గించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌భుత్వంపై ఒత్తిడి వ‌స్తోంది. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడి బండి సంజ‌య్‌తో పాటు డీకే అరుణ లాంటి నాయ‌కులు ఈ మేర‌కు కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఏపీలోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతోంది. మ‌రోవైపు ఏకంగా రూ.40 పెంచి ఇప్పుడు రూ.5 త‌గ్గించ‌డంపై కేంద్రంపైనా సామాన్య ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.