కేసీఆర్‌ పై సెటైర్లు వేస్తున్న ఏపీ మంత్రులు

ఏపీలోనూ టీఆర్‌ఎస్ పార్టీని పెట్టాలని అక్కడి నుంచి వేలాదిగా ఆహ్వానాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో పార్టీ పెట్టాలని తాము గెలిపించేందుకు సిద్ధంగా ఉండామని ఏపీ ప్రజలు తనను కోరుతున్నారని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఏపీలో కూడా అమలు చేయాలని కోరుతున్నారని కేసీఆర్ ప్రకటించి కలకలం రేపారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు అని స్వాగతిస్తూనే కేసీఆర్‌పై మంత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీలో అభివృద్ధి జరుగులేదని పరోక్షంగా చేస్తున్న కేసీఆర్ వ్యాఖ్యలను ఏపీ మంత్రులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పేర్నినాని మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఈ క్రమంలోనే ఏపీలో పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పేర్నినాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లో టీఆర్ఎస్‌ పార్టీ ఎందుకు? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని వెటకారంగా వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెట్టాలని కోరారు. తెలుగు రాష్ట్రాలను కలపాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే బాగుంటుందని సూచించారు. తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయొచ్చు కదా అని సరదాగా వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణాలు సమైక్యంగా ఉండాలని సీఎం జగన్ గతంలోనే కోరుకున్నారని పేర్నినాని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలనే అభిప్రాయం తమకు ఉందన్నారు. సమైఖ్యాంధ్ర కోసం వైసీపీ అనేక ఉద్యమాలు చేసిందని పేర్నినాని గుర్తుచేశారు.

మొదట్లో సీఎం జగన్, కేసీఆర్ మధ్య స్నేహ పూరిత వాతావరణం ఉండేది. ఈ తర్వాత ఇద్దరు సీఎంల మధ్య నీళ్ల లొల్లి మొదలైంది. ఒకరిపై ఒకరు కృష్ణా యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేసుకునే దాకా వెళ్లారు. ఇంతలోనే తెలంగాణలో షర్మిల పార్టీని పెట్టడం.. జగన్ ప్రొద్బలంతోనే షర్మిల పార్టీని పెట్టారనే చర్చ సాగడం. షర్మిల కూడా కేసీఆర్ టార్గెట్ చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే షర్మిల పార్టీకి తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. షర్మిల పార్టీ పెట్టిన తర్వాతనే ఏపీ మంత్రులపై సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రులు అనేక సందర్భాల్లో ఆరోపణలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా నీళ్లు, విద్యుత్ ఉత్పత్తిపై టీఆర్‌ఎస్ మంత్రులు, జగన్‌పై చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను జగన్ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఏడేళ్లు అవుతున్నా.. ఏపీకి సంబంధించి ఇప్పడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఏపీ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ వ్యాఖ్యాలపై మంత్రి అనిల్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఖండించారు. ఏపీలో టీఆర్‌ఎస్ పార్టీ పెట్టాలనుకుంటే ఎవరైనా వద్దాన్నారా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ విడిపోకుండా ఉండి ఉంటే దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేదని సజ్జల వ్యాఖ్యానించారు.