ఎస్సీ ఓటు బ్యాంకు కోసం.. ప‌వ‌న్ వ్యూహం ఫ‌లించేనా?

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఎలా అయినా ఉండొచ్చు. ఎటు నుంచి ఎటైనా సాగొచ్చు. అయితే.. ఆయా వ్యూహాలు ఏమేర‌కు ఫ‌లితాన్ని ఇస్తాయి? అనేది మాత్రం అత్యంత కీల‌కం. ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విష‌యం లో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం మేధావుల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎవ‌రు అధికారంలోకి రావాల‌న్నా.. కొన్ని కీల‌క సామాజిక వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకోవాల్సిందే. పార్టీ అధినేతల సామాజిక వ‌ర్గాల‌కు తోడు.. రాష్ట్ర జ‌నాభాలో కీల‌కంగా ఉన్న‌.. ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకును కూడా పార్టీలు సొంతం చేసుకుంటే నే..అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే.. ప్ర‌స్తుతం ఈ ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉన్న‌ద‌నే విష‌యం గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో నే అర్ధ‌మైంది. అయితే.. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఎస్సీల ఓటు బ్యాంకును వైసీపీ నుంచి చీల్చేందుకు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు సాగాయి. ముఖ్యంగా ఈ విష‌యంలో ప‌వ‌న్ చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. ఎక్క‌డో యూపీకి చెందిన మాజీ ముఖ్య‌మంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని తీసుకువ‌చ్చి.. ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారం చేయించారుప‌వ‌న్‌. ఈ క్ర‌మంలోనే బ‌హిరంగ వేదిక‌పై ఆయ‌న ఆమెకు పాద‌న‌మ‌స్కారం చేశారు. కాళ్ల‌పై ప‌డ్డారు. ఇదంతా త‌న‌కు ఎస్సీల‌పై ఉన్న భ‌క్తి అని చాటుకున్నారు.

దీంతో కొన్ని విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఇంకేముంది.. ఎస్సీ ఓటు బ్యాంకు జ‌న‌సేన‌వైపు మ‌ళ్లుతుంద‌ని.. రాజ‌కీ య వ‌ర్గాలు చెప్పుకొచ్చాయి. మ‌రి ఇంత చేసినా.. ఇది జ‌రిగిందా? అంటే.. ఎస్సీ సామాజిక వ‌ర్గాలు ఎక్కువ గాఉన్న అన్ని చోట్లా.. వైసీపీనే గెలుపుగుర్రం ఎక్కింది. ఒక్క ప్ర‌కాశం జిల్లా కొండ‌పిలో టీడీపీ గెలిచింది. మ‌రి ప‌వ‌న్ సాధించింది ఏంటి? అంటే.. ఏమీ క‌నిపించ‌లేదు. ఇక‌.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు రెండున్న‌రేళ్ల ముందు నుంచే.. ప‌వ‌న్‌.. ఎస్సీల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య‌ను ఆయ‌న మోసేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్ర‌ ద‌ళిత ముఖ్య‌మంత్రి.. దివంగ‌త దామోద‌రం సంజీవ‌య్య ఇంటిని స్మార‌కంగా.. ఏర్పాటు చేస్తామ‌ని.. దీనికి సంబంధించి రూ.కోటితో క‌న్సాలిడేట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని.. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఆయ‌న ఇంటికి సంబంధించి.. జ‌న‌సేన నాయ‌కులు ప‌రిశీలించి వ‌చ్చారు. ఇక‌, ప‌వ‌న్ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్నూలు జిల్లాకు దామోద‌రం సంజీవ‌య్య పేరు పెట్టాల‌ని అన్నారు. ఇది మంచి ప్ర‌క‌ట‌నే. త‌న జీవితాన్ని పూర్తిగా ప్ర‌జ‌ల‌కే పూర్తిగా అంకితం చేసిన‌.. మేధావి.. జీతం కూడా త‌క్కువ‌గా తీసుకున్న సీఎంగా చ‌రిత్ర సృష్టించిన దామోద‌రం సంజీవ‌య్య‌కు ఇలాంటి గౌర‌వం ఇవ్వ‌డాన‌న్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు.

అయితే.. ఇక్క‌డ వ‌చ్చింద‌ల్లా.. జ‌గ‌న్ హ‌యాంలోనే ఎందుకు ప‌వ‌న్ ఇలాంటి డిమాండ్లు చేస్తున్నార‌నేదే! గ‌త ఐదేళ్ల త‌న మిత్ర‌ప‌క్షం టీడీపీ పాల‌న‌లో క‌నిపించ‌ని దామోద‌రం సంజీవ‌య్య ప‌వ‌న్‌కు ఇప్పేడే క‌నిపిస్తుండ‌డంపై అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ద‌ళిత ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనేందుకు మాత్ర‌మేన‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు.. ఇదే వ్యాఖ్య చేశారు. ఎంత చేసినా.. ఎస్సీ సామాజిక వ‌ర్గాన్ని న‌మ్మించ‌డం.. ప‌వ‌న్‌కు సాధ్యం కాద‌ని అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ త‌న దూకుడును ఎలా సాగిస్తారో చూడాలి. ప్ర‌స్తుతం ఈ వ‌ర్గం.. వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉంది. దీనిని తప్పించి.. జ‌న‌సేన త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌గ‌లిగితే.. బ‌ల‌మైన ఓటు బ్యాంకు ప‌వ‌న్‌కు అండ‌గా నిలిచిన‌ట్టేన‌ని అంటున్నారు. మ‌రిఇది సాధ్య‌మేనా? అన్న‌ది చూడాలి.