లోకేష్‌కి భ‌లే ఛాన్స్‌!

ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న‌ను తాను నిరూపించుకునేందుకు నానా తంటాలు ప‌డుతోన్న మాజీ ముంఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్‌కు ఇప్పుడు మంచి అవ‌కాశం దొరికింద‌నే చ‌ర్చ సాగుతోంది. టీడీపీ కార్యాయాల‌పై వైసీపీ శ్రేణుల దాడుల‌ను ఆయుధంగా చేసుకున్న ఈ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన లోకేష్ ప్ర‌జ‌ల్లోకి వెళ్తే ఆయ‌న‌కు మంచి మైలేజీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రాజకీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ రూపంలో వ‌చ్చిన అవ‌కాశాన్ని లోకేష్ స‌ద్వినియోగం చేసుకుని మ‌రింత జోరు పెంచుతారా? లేదా మ‌రోసారి నిరాశ ప‌రుస్తారా? అన్న‌ది చూడాల‌ని మ‌రో వ‌ర్గం అంటోంది.

ఓ వైపు త‌న కొడుకు లోకేష్ రాజ‌కీయ జీవితాన్ని తీర్చిదిద్దాల‌ని భ‌విష్య‌త్‌లో టీడీపీని ఆయ‌న చేతుల్లో పెట్టాల‌ని బాబు ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ.. లోకేష్ మాత్రం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోతున్నారు. గ‌త బాబు హ‌యాంలో ఎమ్మెల్సీగా ఎంపికై ఆ త‌ర్వాత మంత్రి అయిన లోకేష్‌.. 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. దీంతో ఆయ‌న రాజ‌కీయాల‌కు ప‌నికి రాడ‌నే కామెంట్లు వినిపించాయి. కానీ వాటికి స‌మాధానం చెప్తూ ఆయ‌న ఇటీవ‌ల త‌న స్పీడు పెంచారు. అధికార వైసీపీ పార్టీపై సీఎం జ‌గ‌న్‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తూ అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. మ‌రోవైపు పార్టీ నాయ‌కుల‌తో ఉన్న విభేదాల‌ను ప‌క్క‌కుపెట్టి పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై లోకేష్ పంథా మారింది. గ‌తంలో కంటే ఇప్పుడు ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దు విష‌యంలో లోకేష్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఆ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం మెండి ప‌ట్టు ప‌ట్ట‌గా విద్యార్థుల త‌ర‌పున పోరాటం చేసిన లోకేష్ విజ‌య‌వంతమ‌య్యారు. చివ‌ర‌కు కోర్టు ఆదేశాల‌తో ఆ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డంతో ఆ క్రెడిట్ లోకేష్ ఖాతాలో చేరింది. ఆ త‌ర్వాత పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు సామాన్య ప్ర‌జ‌ల‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే లోకేష్ అక్క‌డ వాలిపోతున్నారు. ఇటీవ‌ల దారుణ హ‌త్య‌కు గురైన ర‌మ్య కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు వెళ్లిన ఆయ‌న నానా హడావుడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న పొలిటిక‌ల్ కెరీర్‌లోనే తొలిసారి అరెస్ట‌య్యారు.

ఇప్పుడిక టీడీపీ పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు ఆ పార్టీకి అనుకోని వ‌రంలా మారాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కార‌ణంతో అధికార వైసీపీని ఇరుకున పెట్టి ప్ర‌జ‌ల్లో దోషిగా నిల‌బెట్టేందుకు టీడీపీకి మంచి అవ‌కాశం దొరికింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న ఇక్క‌డితోనే ముగిసి పోయేది కాద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఇదే ప్ర‌ధాన ఆయుధంగా మారే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంతో పాటు వైసీపీపై వ్య‌తిరేక‌త పెంచ‌డంలో లోకేష్ విజ‌య‌వంత‌మైతే అది ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని గొప్ప మ‌లుపు తిప్పుతుంద‌ని నిపుణులు అనుకుంటున్నారు. మ‌రి లోకేష్ ఏం చేస్తారో చూడాలి.