‘కొండా’ వారి రక్తచరిత్ర

సెన్సేషనలిషజమే ఊపిరిగా బతికే రామ్‌ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో తెలీదు. ఎలాంటి కాన్సెప్ట్ను ఎంచుకుని ఎవరిని కంగారు పెడతాడో అర్థం కాదు. ఆల్రెడీ ఎన్టీఆర్, జగన్‌ల జీవితాలను తెరకెక్కించాడు. తర్వాత శశికళ లాంటి కొందరిపై సినిమాలను ప్రకటించాడు. ఇప్పుడు కొండా వారి ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. వరంగల్ రాజకీయాల్లో అత్యంత కీలక వ్యక్తులైన కొండా మురళి, సురేఖల ప్రేమకథని, వారి రాజకీయ జీవితాన్ని చూపిస్తానంటూ ‘కొండా’ టైటిల్తో కొత్త సినిమాని ప్రకటించాడు వర్మ.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో తన వాయిస్‌తో ఇంట్రడక్షన్ ఇచ్చాడు వర్మ. తాను విన్న విషయాల్లో ఎన్‌కౌంటర్‌‌లో చంపేయబడ్డ ఆర్కేకి, కొండా మురళికి ఉన్న సంబంధం చాలా ఆసక్తిగా అనిపించిందని, అప్పటి పరిస్థితుల్ని సినిమాగా తీయడానికి మురళిని కలిసి కో ఆపరేట్ చేయమని కూడా అడిగానని, ఆయన కూడా ఒప్పుకున్నాడని వర్మ చెప్పాడు. ‘గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా.. అర్థం కాలే’ అనే క్యాప్షన్‌తో కాన్సెప్ట్పై ఆసక్తిని పెంచాడు.

తాను తీస్తున్నది సినిమా కాదని, తెలంగాణలో జరిగిన ఓ రక్త చరిత్రని అంటున్నాడు వర్మ. ఈ చిత్ర విప్లవం అతి త్వరలో మొదలు కాబోతోంది అంటూ క్యూరియాసిటీని రేపే ప్రయత్నం చేశాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని తెరకెక్కించడంలో వర్మ ఎంత సిన్సియర్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. దాంతో కొండా వారి జీవితాల్ని ఎలా చూపించబోతున్నాడో, మురళి, సురేఖ పాత్రలకు ఎవరిని తీసుకుంటాడోననే ఆసక్తి కలుగుతోంది.