వివేకా హంతకులు వీళ్ళేనా ?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు దొరికినట్లేనా ? సీబీఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ప్రకారం అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ వివేకాను హత్యచేసినట్లుగా సీబీఐ స్పష్టంగా చెప్పింది. తమకు లభించిన ఆధారాల ప్రకారం పై ఇద్దరే వివేకాను హత్య చేశారనటానికి చాలా ఆధారాలున్నట్లు సీబీఐ చెప్పింది.

వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన సమాచారం ప్రకారం దర్యాప్తు అధికారులు సునీల్ యాదవ్ ను అరెస్టుచేసి విచారించారు. వీరి విచారణలో ఉమాశంకర్ రెడ్డి పాత్ర బయటపడింది. ఈ ఉమాశంకర్ ఎవరంటే వివేకా పీఏ సోదరుడట. యాదవ్, ఉమాశంకర్ ఇద్దరు వివేకా హత్యకు ముందు వాళ్ళింట్లో కుక్కను మోటారు సైకిల్ తో గుద్ది చంపేసినట్లు సీబీఐ చెప్పింది. తర్వాత వివేకాను హత్య చేయటానికి వీళ్ళద్దరు పల్సర్ బైక్ లో గొడ్డలి తీసుకుని వెళ్ళారట.

వివేకా తలపై గొడ్డలితో నరికినట్లు పోస్టుమార్టమ్ లో తేలిన విషయాలను సీబీఐ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. హత్య తర్వాత ఉమాశంకర్ గొడ్డలిని తీసుకుని బైకులో పారిపోయాడట. తర్వాత విచారణలో భాగంగా సీబీఐ అధికారులు బైకును, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. పోయిన నెలలో ఉమాశంకర్ ఇంట్లో సోదాలు చేసిన దర్యాప్తు అధికారులు రెండు చొక్కాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వివేకా హత్యకు సంబంధించి మరికొందరు నిందితులను, ఆయుధాలను మాత్రం స్వాధీనం చేసుకోవాల్సుందని సీబీఐ చెప్పింది.

అంతా బాగానే ఉందికానీ అసలు వీళ్ళద్దరు వివేకానందరెడ్డిని ఎందుకు హత్య చేశారనే విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. వివేకా సామాజికస్ధాయితో పోల్చుకుంటే వీళ్ళద్దరి ఏ విధంగా చూసినా సరితూగరు. అలాంటిది వీళ్ళకు వివేకాను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీటంలేదు. ఏదన్నా చిన్న విషయాల్లో విభేదాలొచ్చాయి అనుకున్నా వివేకాకున్న బ్యాక్ గ్రౌండ్ కారణంగా ఎవరు కూడా వివేకాతో విభేదించేందుకు సాహసించరు. అయినా హత్య జరిగిందంటే తెరవెనుక ఏమి జరిగిందో ? ఎవరున్నారో అర్ధం కావటంలేదు.