వైసీపీ ఎమ్మెల్యేకు జేసీ స‌పోర్ట్ ?

టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న అనంత‌పురం జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం అర్బ‌న్‌. ఇక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌భాక‌ర‌చౌద‌రి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. 2012లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కూడా వైసీపీ పాగా వేసినా.. 2014లో మాత్రం ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. జిల్లా వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా..ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం వైసీపీ, టీడీపీల మ‌ధ్య విజ‌యం మారుతోంది. కాంగ్రెస్ సానుకూల ఓటుబ్యాంకును ద‌క్కించుకునేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది.

కానీ, ఇది ఒక్కొక్క‌సారి ఫ‌లిస్తున్నా.. త‌ర్వాత విఫ‌ల‌మ‌వుతోంది. దీనిని ప‌సిగ‌ట్టిన టీడీపీ.. త‌మ ఓటు బ్యాంకును క‌దిలిపోకుండా చూసుకుంటోంది. అర్బ‌న్ రాజ‌కీయాల్లో టీడీపీకి గ‌ట్టి ప‌ట్టుంది. ప్ర‌భాక‌ర్ చౌద‌రికి సింప‌తీతోపాటు అభివృద్ధి చేసే నాయ‌కుడిగా పేరుంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జేసీవ‌ర్గంతో ఆయ‌న‌కు ఉన్న విభేదాలు తీవ్ర‌స్థాయిలో ప్ర‌భావం చూప‌డంతో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయార‌నే వాద‌న ఉంది. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి కొన‌సాగుతున్నా.. ప్ర‌భాక‌ర్ చౌద‌రి మాత్రం త‌న‌కున్న ప‌ట్టును కొన‌సాగిస్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను జోరుగా నిర్వ‌హిస్తున్నారు.

ఇక‌, ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నవైసీపీ నాయ‌కుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి కూడా దూకుడుగానే ఉన్నారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్యా పొలిటిక‌ల్ పాచిక‌లు బాగానే పారుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో చౌద‌రి వ‌దిలేసిన అనంత‌పురం ప్ర‌ధాన ర‌హ‌దారి వెడ‌ల్పు ప‌నుల‌ను వెంక‌ట్రామిరెడ్డి పూర్తి చేయించారు. అదే స‌మ‌యంలో ఇంటింటికీ తాగు నీరు, మ‌రుగుదొడ్ల ప‌థ‌కాన్ని కూడా కొన‌సాగిస్తున్నారు. దీంతో చౌద‌రికి చెక్ పెట్టాల‌ని చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో చౌద‌రి.. వైసీపీ నేత‌ల అక్ర‌మాలు, ఇసుక మాఫియాను చౌద‌రి వెలుగులోకి తెస్తున్నారు. దీంతో ఇరు ప‌క్షాల‌మ‌ధ్య మాట‌ల యుద్దం సాగుతోంది.

మ‌రోవైపు… జేసీ వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేకు సెగ త‌గ‌ల‌డం అటుంచితే.. సొంత పార్టీ నేత చౌద‌రి విష‌యంలో జేసీ వైఖ‌రి ఏమాత్రం మార‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను జేసీ వ‌ర్గం నిర్వ‌హించ‌డం లేదు. పైగా చౌద‌రి నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు ఎవ‌రూ వెళ్ల‌కుండా హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేకు ప‌రోక్షంగా జేసీ వ‌ర్గం స‌హ‌క‌రిస్తోంద‌ని.. చౌద‌రి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అనంత రాజ‌కీయం ఎత్తులు, పై ఎత్తుల‌తో రంజుగా మారింది.