హైడ్రా ఎఫెక్ట్‌.. టీడీపీకి పండ‌గ‌.. !

కొన్ని కొన్ని ఘ‌ట‌న‌ల‌కు కార్యాకార‌ణ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు.. అక్క‌డి తెలుగు దేశం పార్టీ పుంజుకోవడానికి కూడా కార‌ణాలు ఒకేలా ఉన్నాయి. ఇక‌, అయిపోయింద‌ని అనుకున్న తెలంగాణ టీడీపీ.. పుంజుకునే ప‌రిస్థితికి చేరుకున్న విష‌యం తెలిసిందే. ఏపీలో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. తెలంగాణ‌పై చంద్ర‌బాబు ఫోక‌స్ పెంచారు. ఈ క్ర‌మంలో వారానికి ఒక‌సారి అక్క‌డ ప‌ర్య‌టించ‌డం.. నాయ‌కుల‌తో భేటీ కావ‌డం తెలిసిందే.

అదేస‌మ‌యంలో పార్టీని పుంజుకునేలా చేసేందుకు కూడా చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న ప‌రిస్థితి ఇప్పుడు తెలంగాణ‌లో మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో అనూహ్యం గా మారిపోయింది. హైడ్రా రంగంలోకి దిగిన త‌ర్వాత‌.. త‌న – మ‌న అన్న తేడా లేకుండా.. కూల్చి వేత‌లు సాగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఎవ‌రి మాటా విన‌కుండా దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం బీఆర్ ఎస్‌లో ఉంటూ ఆ పార్టీపై గుస్సాగా ఉన్న నాయ‌కులు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్ర‌య‌త్నించారు.

కానీ, లెక్క‌లు కుద‌ర‌క మౌనంగా ఉండిపోయారు. ఇక‌, ఇప్పుడు వారికి ప్ర‌ధాన ప్ర‌త్యామ్నాయంగా టీడీపీ క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే పాత నాయ‌కులు.. మాజీ మంత్రులు కూడా ఇప్పుడు ఏరికోరి టీడీపీ దారిలోకి వ‌స్తున్నారు. వ‌రుస‌గా పార్టీ అధినేత చంద్ర‌బాబును క‌లుస్తున్నారు. మ‌న‌సులో మాట చెబుతున్నారు. దీనికి చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుండ‌డంతో పార్టీలో చేరేందుకు నాయ‌కులు రెడీ అయ్యారు.

టీడీపీలో చేరేవారి ఆశ‌, అభిలాషలు చాలానే ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ కావ‌డంతో తెలం గాణ‌లో త‌మ‌కు, త‌మ వ్యాపారాల‌కు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఉంటుందన్న ఆశ ఒక‌టి. పార్టీ ప‌రంగా రాజ‌కీయాల ప‌రంగా టీడీపీలో చాలా అవ‌కాశాలు ఉన్నాయి. పైగా సానుభూతి ప‌వ‌నాలు కూడా టీడీపీకి ఎక్కువ‌గానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీలోకి చేర‌డం ద్వారా.. త‌మ‌కు ఒక బ‌ల‌మైన అండ ల‌భిస్తుంద‌న్న ఉద్దేశం క‌నిపిస్తోంది. ఇక‌, బ‌ల‌మైన నాయ‌కులుగా పేరున్న వారు, ఆర్థికంగా ఖ‌ర్చు పెట్ట‌గ‌ల నాయ‌కులు కావ‌డంతో టీడీపీకి మేలు చేకూరుతుంద‌న్న అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి.