లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు: సుప్రీం

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిందని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరగా..ఈ రోజు అందుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు,FSSAI నుంచి ఒక అధికారి..ఇలా మొత్తం ఐదుగురు సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు, ఏపీ పోలీసు శాఖ నుంచి ఇద్దరు సీనియర్ అధికారులు
ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి ఒక మోస్ట్ సీనియర్ ఆఫీసర్ ఉండాలని దేశపు అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఈ దర్యాప్తు మొత్తం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇక, రాజకీయ ప్రేరేపణలకు, పొలిటికల్ డ్రామాలకు ఈ వ్యవహారంలో అవకాశం ఉండకూడదని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.