క్ష‌మాప‌ణ చెబుతావా.. క్రిమ‌న‌ల్ కేసు పెట్ట‌మంటావా : కేటీఆర్

తెలంగాణ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కురాలు కొండా సురేఖ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. గ‌త నాలుగు రోజులుగా ఆమె వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న‌రావుతో క‌లిసి పాల్గొన్న కార్య‌క్ర‌మంలో తీసిన ఫొటోను మార్ఫింగ్ చేసి.. త‌నను మాన‌సికంగా బాధించార‌ని చెప్పిన సురేఖ‌.. అంతో ఇంతో సింప‌తీ సంపాయించుకున్నారు. ఇదేసమ యంలో ఆమె మాజీ మంత్రి కేటీఆర్‌ను కేంద్రంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఇంత‌లోనే ఆమె నోరు జారి నానా మాట‌లు అనేశారు. ఇవే ఇప్పుడు సురేఖ‌కు ప్రాణ సంక‌టంగా మారాయి.

అక్కినేని నాగార్జున కోడ‌లు(మాజీ) సమంత‌ను కేటీఆర్ పిలిచారంటూ.. పెద్ద బాంబు పేల్చారు సురేఖ‌. ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చ‌కుండా ఉండాలంటే అలా చేయాల‌ని ష‌ర‌తు పెట్టార‌ని అన్నారు. దీనికి స‌మంత అంగీక‌రించ‌లేద‌న్నారు. అంతేకాదు.. ఇదే ఆమెతో నాగ చైత‌న్య విడాకులు తీసుకునేందుకు కార‌ణ‌మైంద‌ని కూడా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక్క‌డితో కూడా ఆగ‌కుండా ఫోన్ల‌ను ట్యాప్ చేసి కేటీఆర్ వికృతానందం పొందార‌ని సురేఖ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లు రాజకీయంగానే కాకుండా.. సామాజిక ప‌రంగా కూడా తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఇప్ప‌టికే అక్కినేని నాగార్జున రియాక్ట్ అయ్యారు.

త‌మను రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏకంగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. త‌న‌కు బ‌హిరంగం గా క్ష‌మాప‌ణ చెప్పాల‌న్నారు. 24 గంట‌ల్లో ఆమె మీడియా ముందుకు వ‌చ్చి త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే.. క్రిమిన‌ల్ కేసు పెడ‌తాన‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. తన గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంతోనే సురేఖ తనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ మేర‌కు కేటీఆర్ .. సురేఖ‌కు లీగల్ నోటీసులు పంపించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోతే.. పరువు నష్టం దావా వేస్తాన‌ని తేల్చి చెప్పారు.