ఏ అవకాశాన్నీ వదలని జగన్ !

ముఖ్యమంత్రి జగన్ పథకాలు గాని, నిర్ణయాలు గాని, ఆలోచనలు గాని భవిష్యత్తు రాజకీయాలకు పునాదులు వేసుకునే విధంగానే ఉంటున్నాయి. ప్రతి నిర్ణయంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బలమైన ఓటు బ్యాంకును తయారుచేసుకునే వ్యూహాలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం నియమించనున్న బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకాల్లో అత్యధికారం మహిళలనే నియమించాలని డిసైడ్ అయ్యారు. 56 బీసీ కార్పొరేషన్ల పోస్టులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బహుశా బుధవారం అంటే ఈరోజు ప్రకటన జారీ చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఛైర్మన్లుగా ఎవరిని ఎంపిక చేయాలి ? డైరెక్టర్లుగా నియమితులయ్యే వారి జాబితాను కూడా జగన్ ఫైనల్ చేసేశారని పార్టీ వర్గాలు చెప్పాయి.

పై పోస్టులకు ఎవరిని ఎంపిక చేసిందనే విషయం విడివిడిగా పూర్తిగా తెలియకపోయినా మొత్తం మీద మహిళలకే అగ్రస్ధానం దక్కబోతోందన్న విషయంలో మాత్రం జగన్ ఇప్పటికే క్లారిటి ఇచ్చారట. గతంలో బీసీలకు ఉన్న 26 కార్పొరేషన్ల సంఖ్యను జగన్ అధికారంలోకి రాగానే అదనంగా మరో 30 పెంచారు. దాంతో మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 56కి పెరిగింది. మళ్ళీ ఒక్కో కొర్పొరేషన్లో సుమారు 10 మంది డైరెక్టర్లుంటారు. 56 కార్పొరేషన్ల పోస్టుల్లో 29 ఛైర్మన్ల పోస్టులను జగన్ మహిళలకే కేటాయించారు.

ఛైర్మన్ల నియామకాల్లో ప్రతి జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకున్నారు. సగటున ప్రతిజిల్లాకు నాలుగు ఛైర్మన్ పోస్టులు దక్కనున్నాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 6 గురు ఛైర్మన్లుంటే తక్కువగా కృష్ణా, విశాఖపట్నం జిల్లాల నుండి ఐదుగురు చొప్పున మహిళలు నియమితులు అవబోతున్నారు. వీళ్ళు కాకుండా డైరెక్టర్ల నియామకాల్లో కూడా 50 శాతం మహిళలకే రిజర్వు చేసేశారు. ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకాల్లో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే వ్యూహం అర్ధమవుతోంది.

జనాభాలోనే కాకుండా ఓటర్లలో కూడా మహిళలదే అగ్రస్ధానం అన్న విషయం తెలిసిందే. కాబట్టే మహిళలను ఆకట్టుకునేందుకే వాళ్ళకు బాగా ప్రాధాన్యత ఇస్తోంది ప్రభుత్వం. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే చిన్న సమస్య వస్తోంది. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఏమీ బాలేదు. ఇటువంటి సమయంలో ఇన్నిన్ని ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేయటమంటే ప్రభుత్వంపై అదనపు ఆర్ధిక భారమనే చెప్పాలి. ఎలాగంటే వీళ్ళని నియమించిన తర్వాత జీత, భత్యాలు చెల్లించాలి. ఛైర్మన్లకు కార్యాలయాలు, ఛాంబర్లు, వాహనాలు అన్నీ సమకూర్చాలి. అంటే ఇవన్నీ సమకూర్చాలంటే ప్రభుత్వంపై అదనపు ఆర్ధికభారమనే చెప్పాలి. మరి ఈ పరిస్దితుల్లో ఇన్ని కార్పొరేషన్ల నియామకాలు అవసరమా ? అప్పులో అప్పంటారా ? అప్పుచేసి పప్పుకూడు తినటమంటే ఇదేనేమో.