బాలినేనిని పవన్ కాపాడలేరు: దామచర్ల

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరబోతున్న నేపథ్యంలో ఒంగోలులో ఫ్లెక్సీ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటు బాలినేని ఫ్లెక్సీలు కలిపి వేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలు చింపి వేశాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా బాలినేనికి మరో షాక్ తగిలింది. జనసేనలో చేరినా బాలినేనిని వదిలిపెట్టమబోమంటూ దామచర్ల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

బాలినేని జనసేనలో చేరినా చర్యలు తప్పవని దామచర్ల వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, బాలినేనితో పాటు ఆయన తనయుడు ప్రణీత్ పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2024 ఎన్నికలకు ముందు తనపై, టీడీపీ నేతలపై, కార్యకర్తలపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని గుర్తు చేశారు. అటువంటి బాలినేనిని పవన్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. బాలినేనిపై చర్యల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ఎంతవరకైనా వెళతానని దామచర్ల తేల్చి చెప్పారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ రోజు జనసేనలో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలినేని భారీ సభ, భారీ కాన్వాయ్ తో పవన్ సమక్షంలో జనసేనలో చేరతారని అంతా భావించారు. కానీ, బాలినేని అత్యంత నిరాడంబరంగా ఈ రోజు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఒంగోలులో సభ, కాన్వాయ్ లతో బల ప్రదర్శన అవసరం లేదని, ఒక్కరే మంగళగిరి వచ్చి పార్టీలో చేరాలని జనసేన అధిష్టానం ఆదేశించడంతో బాలినేని బల ప్రదర్శన విరమించుకున్నారు. బాలినేనితోపాటు ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా నేడు జనసేనలో చేరబోతున్నారు.