నందిగం సురేష్‌పై మ‌ర్డ‌ర్ కేసు.. ఏం జ‌రిగింది?

వైసీపీ మాజీ ఎంపీ, ఎస్సీ నాయ‌కుడు నందిగం సురేష్‌పై తాజాగా మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ఆయన‌పై టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడి కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం, 14 రోజులు జైల్లో ఉన్న ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం ఇదే కేసులో పోలీసుల క‌స్ట‌డీకి కూడా ఆయ‌న‌ను తీసుకున్నారు. కూలంక‌షంగా ఈ కేసును విచారించారు. మొత్తానికి ఈ కేసులో నందిగం తిప్ప‌లు ప‌డుతున్నారు. బెయిల్ పిటిష‌న్ హైకోర్టులో పెండింగులో ఉంది.

అయితే.. ఇప్పుడు నందిగం సురేష్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు మ‌ర్డ‌ర్ కేసును న‌మోదు చేశారు. 2020లో తుళ్లూరు మండ‌లం.. వెల‌గ‌పూడిలో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో ఆయ‌న ప్ర‌మేయం ఉందంటూ.. తాజాగా పోలీసులు కేసు పెట్ట‌డంతోపాటు.. ఆయ‌న‌కు పీటీవారెంటు కూడా జారీ చేశారు. దీంతో ప్ర‌స్తుతం టీడీపీ ఆఫీసుపై కేసులో నందిగంకు బెయిలు ద‌క్కినా.. వెంట‌నే హ‌త్య కేసులో ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏం జ‌రిగింది?

2020లో తుళ్లూరు మండ‌లం, వెల‌గ‌పూడికి చెందిన ఎస్సీ మ‌హిళ మ‌రియ‌మ్మ‌.. వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ లు గుప్పించారు. త‌న‌కు వ‌స్తున్న పింఛ‌నును నిలిపివేశార‌ని.. ఇళ్లు ఇస్తామ‌ని కూడా ఇవ్వ‌లేద‌ని అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను దూషించారు. దీంతో అప్ప‌టి ఎంపీ నందిగం సురేష్ అనుచ‌రులు.. ఆమె ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో మ‌రియ‌మ్మ పై దాడి కూడా జ‌రిగిన‌ట్టు ఆమె కుమారుడు తాజాగా తుళ్లూరు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో ఆమె మ‌ర‌ణించింద‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంపై అప్ప‌ట్లోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్నారు. క‌నీసం ఇప్పుడై నా త‌మ‌కు న్యాయం చేయాలంటూ.. మంత్రి నారా లోకేష్‌ను క‌లిసి కొన్నాళ్ల కింద‌ట ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా తుళ్లూరు పోలీసులు తాజాగా కేసు న‌మోదు చేశారు. నందిగం సురేష్ స‌హా ఆయ‌న అనుచ రుల‌పై కేసులు పెట్టారు. దీంతో నందిగం చుట్టూ మ‌రో కీల‌క కేసు చుట్టుకున్న‌ట్టు అయింది.