వ‌రద బాధితుల కోసం పోరాటం చేస్తాం: జ‌గ‌న్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా ఎక్స్ వేదిక‌లో స్పందించారు. విజ‌య‌వాడ‌లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌పై ఆయ‌న సుదీర్ఘ లేఖ రాశారు. మొత్తం 8 అంశాల‌పై ఆయ‌న త‌న వాద‌న వినిపించారు. ఈ క్ర‌మం లో సీఎం చంద్ర‌బాబు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ మ‌ధ్య జ‌రిగిన ఓ కీల‌క ఫోన్ సంభాష‌ణ‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌భుత్వం ఏమైంద‌ని.. వారం రోజుల విపత్తులో ప్ర‌జ‌లు అల్లాడుతున్నార‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల నుంచి వారిని ర‌క్షిత ప్రాంతాల‌కు చేర‌వేయ‌లేక పోయార‌ని విమ‌ర్శించారు.

వ‌ర‌ద‌లు సంభ‌వించి వారం అయినా..బాధితుల ఆక‌లిని ప్ర‌భుత్వం తీర్చ‌లేక పోయింద‌ని.. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబే అంగీక‌రించార‌ని జ‌గ‌న్ చెప్పారు. అలాంట‌ప్పుడు స‌ర్కారు ఏం చేస్తున్న‌ట్టు? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. “వరదలకన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5 కోట్లమంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం ఐదారు లక్షలమందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా?” అని ప్ర‌శ్నించారు.

మూడు రోజుల్లో 30 సెంటీ మీట‌ర్ల వర్షం పడ్డం అసాధారణం ఏమీ కాదన్న జ‌గ‌న్‌.. గతంలో చాలాసార్లు ఇలాంటి విప‌త్తులు వ‌చ్చాయ‌ని.. కానీ, అప్ప‌ట్లో ఇలా 50 మందికిపైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదన్నారు. బాధితులకోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలు ఎక్కడున్నాయో ఎవ‌రికీ తెలియ‌డం లేద‌న్నారు. వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం కోసం ఎదురు చూస్తున్నార‌ని తెలిపారు.

ముందే స‌మాచారం ఉన్నా..

రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ‌ర‌ద‌లు, వ‌ర్షాల‌కు సంబంధించి ముందుగానే స‌మాచారం ఉంద‌ని.. జ‌గ‌న్ చెప్పారు. అయినా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. శుక్రవారం(ఆగస్టు 30) నుంచి భారీ వర్షాలు వస్తాయని, భారీగా వరద వస్తుందని బుధవారం రోజే (ఆగస్టు 28) అలర్ట్‌ వచ్చినా, అప్పటికే కృష్ణానదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని తెలిసినా, అలాగే పైనుంచి, ఇతర రాష్ట్రాలనుంచి భారీగా వరద వస్తుందని సమాచారం ఉన్నా, బుధవారం నుంచి శుక్రవారం వరకూ రెండున్నరోజుల సమయం ఉన్నా మీరు పట్టించుకోలేదు అని జ‌గ‌న్ పేర్కొన్నారు.

పోరాటాలు చేస్తాం..

“80వేల కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుంటే తొలిరోజు 15వేల మందికీ ఇవ్వలేకపోయారని స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరే బేలతనం చూపడం ఏంటి?“ అని చంద్ర‌బాబును జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. “లక్షల ఉద్యోగులున్న యంత్రాంగం ఏమైపోయింది? ఇప్పటికీ ఇంటింటికీ జల్లెడపట్టి ఎన్యుమరేషన్‌ చేసిన దాఖలాలేవీ కనిపించడంలేదు” అని పేర్కొన్నారు. బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయండి. మీరు ఆదుకోకపోతే మా పార్టీ తరఫున కచ్చితంగా పోరాటాలు చేస్తామ‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు.