బాబు ఆరాటం.. ప్ర‌జ‌ల పోరాటం.. ఏం జ‌రుగుతోంది?

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునే విష‌యంలో సీఎం చంద్ర‌బాబు ఎంతో ఆరాట ప‌డుతున్నారు. నీట మునిగి పోయిన ప్రాంతాల్లో స్వ‌యంగా ఆయ‌నే ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రిస్తూ.. భ‌రోసా నింపుతున్నా రు. నేనున్నానంటూ.. ఆయ‌న బాధితుల్లో ధైర్యం నింపే ప‌నిచేస్తున్నారు. అర్ధ‌రాత్రి స‌మ‌యాల్లో కూడా టార్చ్ లైట్లు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. అంతేకాదు.. వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా అందుబాటులోకి తీసుకువ‌స్తున్నారు.

కానీ, వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల బాధ‌లు మాత్రం త‌ప్ప‌డం లేదు. స‌గానికి పైగాబాధిత‌ ప్ర‌జ‌ల‌కు స‌ర్కారు చేస్తున్న సాయం అంద‌డం లేదు. ఇది అధికారికంగా చంద్ర‌బాబు నోటి నుంచి వ‌చ్చిన అంశ‌మే. నేను చేస్తున్నాను. కానీ, మా వోళ్లు మాత్రం వెనుక‌బ‌డుతున్నారు. నేను చాలా బాధ‌ప‌డుతున్నా అని ఆయ‌న స్వ‌యంగా చెబుతున్నారు. నిజానికి వ‌ర‌ద ముప్పు వ‌చ్చిన వెంట‌నే అధికారుల‌కు సెల‌వు ర‌ద్దు చేశారు. మంత్రుల‌ను రంగంలోకి దింపారు.

చిన్నా చిత‌కా.. క్షేత్ర‌స్థాయి అధికారుల‌ను కూడా గాడిలో పెట్టారు. అయినా.. ప్ర‌జ‌ల‌కు సాయం అంద‌డం లో మాత్రం కాల‌హ‌ర‌ణం అయిపోతోంది. స‌ర్కారుపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌జ‌లు ర‌గిలి పోతున్నారు. ఈ విష‌యాల‌న్నీ ..చంద్ర‌బాబుకు తెలుసు. అందుకే ఆయ‌న అధికారుల‌పై ఎన్న‌డూ లేని రీతిలో ఆగ్ర హం వ్య‌క్తం చేస్తున్నారు. మీరు చేయ‌క‌పోతే.. ఉద్యోగాల‌కు రాజీనామా చేసి వెళ్లిపోండ‌ని తేల్చి చెప్పారు. మంత్రుల‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు.

మంత్రులుగా సాయం చేయ‌లేని వారిని గుర్తించి ప‌క్క‌న పెడ‌తాన‌ని కూడా చెప్పారు. అయినా..ఎక్క‌డా మార్పు క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు వ‌ర‌ద ప్ర‌భావం త‌గ్గిపోయినా.. అధికారులు కానీ, మంత్రులు కానీ.. విజ‌య‌వాడ శివారు ప్రాంతాల‌కు చేరుకోలేదు. ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించ‌డం లేదు. సుర‌క్షిత ప్రాంతాల్లో కూర్చుని స‌మీక్ష‌ల పేరుతో కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తోనే .. ప్ర‌జ‌లు పోరాటం చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిందనేది వాస్త‌వం.