రంకెలేస్తే..అంకెలు స‌రిపోవు..

గ‌త రెండు రోజులుగా తెలంగాణ‌ను కుదిపేస్తున్న మాజీ మంత్రి, ప్ర‌స్తుత బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హ‌రీష్‌రావు రాజీనామా వ్య‌వ‌హారం కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా హ‌రీష్ రావు మీడియా ముందుకు వ‌చ్చారు. సంపూర్ణ రుణ మాఫీ చేస్తే.. రాజీనామా చేస్తాన‌న్న మాట త‌న‌కు గుర్తుంద‌ని తెలిపారు. ఆ మాట‌కు తాను క‌ట్ట‌బడి ఉన్నాన‌ని చెప్పారు. అయితే.. సంపూర్ణ రుణ మాఫీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం నిరూపించాల‌ని స‌వాల్ రువ్వారు. ఈ స‌వాలును నిరూపిస్తే.. తాను త‌క్ష‌ణం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పారు.

కొడంగ‌ల్‌లో ఓడిపోతే.. రాజీనామా చేస్తాన‌ని రేవంత్ రెడ్డి గతంలో చెప్ప‌లేదా? అని హ‌రీష్‌రావు ప్ర‌శ్నించారు. అప్పుడు మాట త‌ప్ప‌లేదా? అని నిల‌దీశారు. కానీ, తాము మాత్రం ప‌ద‌వుల కోసం ఏనాడూ వెంప‌ర్లాడ‌లేద న్నారు. రైతుల కంటే త‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వి గొప్ప‌కాద‌ని హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. రైతుల స‌మ‌క్షంలో రుణ మాఫీపై చ‌ర్చ‌కు సిద్ధ‌మేనా? అని స‌వాల్ విసిరారు. టైము-ప్లేసు మీరు చెబుతారా? న‌న్ను చెప్ప‌మంటారా? అని హ‌రీష్‌రావు ప్ర‌శ్నించారు. రాష్ట్రం కోసం ప‌ద‌వులు వ‌దిలేసుకున్న చ‌రిత్ర త‌మ సొంత మ‌ని వ్యాఖ్యానించారు.

రంకెలేస్తే..అంకెలు స‌రిపోవు, అబ‌ద్ధాలు నిజం కాదు అని హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. రుణ మాఫీ చేసి ఉంటే శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. 17 వేల కోట్ల‌ మేర‌కు రుణ మాఫీ చేశార‌ని చెబుతున్నా.. అదంతా ఒట్టి బోగ‌స్ అని వ్యాఖ్యానించారు. ఇదే నిజ‌మైతే.. శ్వేత‌ప‌త్రంలో లెక్క‌లు చూపించాల‌ని కోరారు. ఎంత మందికి రుణ మాఫీ చేశారో.. ఇంకా ఎంత మందికి చేయాల్సి ఉందో చెప్పాల‌న్నారు. అన్ని మ‌తాల దేవుళ్ల‌పైనా ఒట్టు పెట్టి మ‌రీ మాట త‌ప్పార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తొండి చేయ‌డంలో తోపు.. బూతులు తిట్ట‌డంలో టాపు అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి హ‌రీష్‌రావు పంచ్‌లు రువ్వారు. రేవంత్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు పాపం త‌గ‌ల‌కుండా దేవుడిని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. రైతుల‌కు భ‌రోసా ఇస్తామ‌ని.. టోపీ పెట్టార‌ని వ్యాఖ్యానించారు.