‘మా చెల్లి జైలుకెళ్లింది.. ఫ్యూచ‌ర్‌లో గొప్ప లీడ‌ర్’

ఇటీవ‌ల కాలంలో దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జైలుకు వెళ్లి.. బెయిల్‌పై వ‌చ్చిన నాయ‌కులు అధికారంలోకి వ‌స్తున్నారు. ఎంపీలుగా గెలుస్తున్నారు. త‌మ స‌త్తా కూడా చాటుతున్నారు. దీనిని ఊహించుకున్నారో.. లేక నిజంగానే అంచ‌నా వేసుకున్నారో తెలియ‌దు కానీ.. బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న చెల్లి జైలుకు వెళ్లింద‌ని.. త్వ‌ర‌లోనే బెయిల్‌పై వ‌స్తుంద‌ని అన్నారు.

అయితే..జైలుకు వెళ్లిన వారు బ‌ల‌మైన నాయ‌కులుగా ఎదుగుతార‌ని చెప్పుకొచ్చారు. తాజాగా ఢిల్లీ మ‌ద్యం కేసులో మాజీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సంద‌ర్భంగా కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌.. త‌న చెల్లి, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌వితకు వ‌చ్చే వారంలోనే బెయిల్ వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం బెయిల్‌కు సంబంధించిన వ్య‌వ‌హారం వేగంగా న‌డుస్తోంద‌నిచెప్పారు.

ఈ సంద‌ర్భంగా క‌విత‌ పై కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న చెల్లి 10 కిలోల‌కు పైగానే బ‌రువు త‌గ్గిపోయింద‌ని.. జైల్లో స‌రిగా తిన‌డం లేద‌ని చెప్పారు. అంతేకాదు.. బీపీతో ఇబ్బంది ప‌డుతున్న‌ట్టు తెలిపారు. గ‌తంలో ఒక‌టి రెండు ట్యాబెట్లు మాత్ర‌మే వేసుకుంటే.. ఇప్పుడు రోజుకు రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటు న్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం అనారోగ్యంతోనే ఉంద‌ని, అయినా ధైర్యం మాత్రం కోల్పోలేద‌ని వ్యాఖ్యానించారు.

జైలు వాతావ‌ర‌ణం క‌విత‌కు ప‌డ‌డం లేద‌న్న కేటీఆర్‌.. 11వేల మంది ఖైదీలు ఉండాల్సిన తీహార్‌ జైల్లో ఏకంగా 30వేల మందిని ఉంచార‌ని ఫైర‌య్యారు. క‌విత చాలా ఇబ్బంది ప‌డుతోంద‌ని అన్నారు. “అయితే.. నేనొక్క‌టి చెబుతున్న‌.. జైలుకు వెళ్లి వ‌చ్చిన వారు ఫ్యూచ‌ర్‌లో ఏమైన‌రో మ‌న‌కు తెలియ‌దా?(ఏపీలో చంద్ర‌బాబును ఉద్దేశించి) పెద్ద లీడ‌ర్ అవ‌లేదా?” అని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు.